39.2 C
Hyderabad
April 18, 2024 15: 28 PM
Slider ఆధ్యాత్మికం

సత్యసాయి: మన మధ్య నడయాడిన మహానుభావుడు

ఆయన నిన్నటి వరకూ మనం చూసిన మనలాంటి మనిషి. వేషభాషలు, రూపురేఖలు కొంచెం విభిన్నంగా కనిపించినా,
మన మధ్యే తిరిగి, మనలాగే మాట్లాడే, మన వలె చమత్కార, హాస్య సంభాషణలు చేసినవాడే. కానీ,ప్రపంచం ఆయన్ని కొత్తగా చూసింది, కొందరు మహోన్నతంగా చూశారు. ఇప్పటికీ కొందరు ధ్యాన, యోగ మార్గాల్లో ఊహించుకుంటూ, దర్శించుకుంటూ ఉంటారు. తద్వారా మనోబలాన్ని పెంచుకుంటూ ఉన్నారు. కొండలు, బండరాళ్లు, పిచ్చిమొక్కలు వెలసిన చోటే ఆయనా వెలిశాడు,వెలిగాడు, ఎందరికో వెలుగులు పంచాడు, చీకట్లు పారద్రోలాడు,ఇక్కట్లు తొలిగించాడు.

ఎప్పుడో వాన కురిస్తే తప్ప అక్కడ నీరు కనిపించదు, మొక్క వికసించదు. ఎద్దుల బండ్లే ప్రయాణ సాధనాలు, దీపపు బుడ్లే వెలుగు మార్గాలు. అంతగా వెనకబడిన ఆ నేల వైపే ప్రపంచమంతా చూసేట్టు చేశాడు. గుడిసెల స్థానంలో కాశహర్మ్యాలు వెలిసేట్టు చూశాడు. నిరక్షర కుక్షులు నడిచిన చోటే విశ్వవిద్యాలయాలు, మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులు నిర్మాణమయ్యాయి. ఆ రాళ్ళ బాటల్లో రోల్స్ రాయిస్ కార్లు తిరిగాయి. బస్సెక్కాలంటే, ట్రైన్ పట్టుకోవాలంటే మైళ్ళు నడవాల్సిన చోట ప్రత్యేక విమానాశ్రయమే వెలిసింది. విసిరి పడేసినట్లు ఎక్కడో ఉండే ఆ కుగ్రామానికి ప్రపంచ దేశాల పెద్దలంతా నడచి వచ్చారు. నిధులు,యంత్రాంగం ఉన్న ప్రభుత్వాలు చేపట్టిన ప్రాజెక్టులు అనుకున్న సమయానికి పూర్తయిన దాఖలాలు తక్కువ. అక్కడ మాత్రం! ఎప్పటికి పూర్తవ్వాలనుకుంటే, కచ్చితంగా అప్పటికే విజయవంతంగా ఆ ప్రాజెక్ట్ సంపూర్ణమవుతుంది. అది అక్కడి ప్రత్యేకత. అదీ,వారి సంకల్పబలం.

ఈ బలానికి,బలగానికి మూలం, సర్వం సత్యసాయిబాబా. ఆ ఊరు పుట్టపర్తి. అక్కడ పొద్దున్నే ఓంకారం వినిపిస్తుంది. మధ్య మధ్యలో భజనలు మారుమ్రోగుతుంటాయి. పేరెన్నికగన్న కళాకారులు పాడి వెళ్లిపోతుంటారు. దేశాధినేతలు, సెలెబ్రెటీలు,వ్యాపార దిగ్గజాలు బాబాను దర్శించుకోవడం కోసం ఆ సీమకు బారులు కట్టినవారే. ఆ కేంద్రానికి పెట్టిన పేరు ‘ప్రశాంతి నిలయం’. పేరుకు తగ్గట్టుగానే ప్రశాంతంగా ఉంటుంది.ఏదైనా అయస్కాంతం అక్కడ వెలిసిందా? అని ఇప్పటికీ ఎందరో ఆశ్చర్యపోతుంటారు. ఆ అయస్కాంతం,ఆ అకర్షణ, ఆ శక్తి,ఆ వైభవం ఆ నేలకు తెచ్చిపెట్టిందీ,ఆ మట్టిని బంగారంగా మార్చిందీ సత్యసాయిబాబా అనే ఒకే ఒక వ్యక్తి. లెక్కల ప్రకారం 1926లో నవంబర్ 23వ తేదీ నాడు జన్మించారు. అందరి వలె కొంతకాలం జీవించి,భౌతికంగా ఈ లోకం వీడివెళ్లిపోయారు. సత్యసాయి,శాంతిసాయి, ప్రేమసాయి ఈ పేర్లు ఆయనవే. మహారాష్ట్రలో వైభవ ప్రాభావంతో వెలిగిపోతున్న ఆధ్యాత్మిక కేంద్రం షిరిడీ.ఆ శక్తికి మూలపురుషుడు పేరు కూడా సాయిబాబా. “ఆయనే నేను -నేనే ఆయన”,అని ఈ పుట్టపర్తి సాయి చెప్పుకున్నారు.

శివుడు,శక్తి నాలో ఉన్నాయని చెప్పారు. నమ్మిన వాళ్లు నమ్మారు. నమ్మని వాళ్లు నమ్మలేదు. ఇప్పటికీ నమ్మేవారు ఉన్నారు, నమ్మనివారూ ఉన్నారు. ఒకటి మాత్రం అందరూ నమ్ముతారు. ఆయన దేవుడా,దైవదూతా, మ్యాజిక్కులు చేసే గారడీవాడా అనే విమర్శలు ప్రశంసలు పక్కన పెట్టి చూస్తే,ఆయన ద్వారా జరిగిన సేవ గొప్పది. ఆయన వల్ల జరిగిన మేలు గొప్పది. విద్య,వైద్యం,భోజనం ఎందరికో అందింది. ఇప్పటికీ ఎందరికో అందుతోంది. దీన్ని అందరూ నమ్ముతారు, అందుకు ఆయన్ను అభిమానిస్తారు. అదే గొప్ప విషయం. అదే సత్యసాయిబాబా ఆకర్షణ. అదే ఆయన వల్ల జాతికి జరిగిన ప్రయోజనం. ప్రేమ,సేవ రెండింటినీ ఆయన నమ్మాడు, అందించాడు,అందించమని అందరికీ చెప్పాడు.

ప్రేమ,సేవ రెండూ గొప్ప మార్గాలు. వాటిని ఆచరించినవారు,ఆచరణకు దారి ఇచ్చినవారు,ఆచరించమని ప్రబోధించిన వాళ్ళందరూ గొప్పవాళ్లే. ఆ విధంగా, పుట్టపర్తి సత్యసాయిబాబాను గౌరవిద్దాం. సత్యమే సుందరం, అదే శివం,అదే శుభం అని బాబా విరివిగా ప్రచారం చేశారు. ముంబయి,హైదరాబాద్, చెన్నైలో సత్యం,శివం,సుందరం అనే కేంద్రాలు స్థాపించారు.

ప్రపంచ వ్యాప్తంగా 166దేశాల్లో 10వేలకుపైగా సత్యసాయి సేవాసంస్థల ద్వారా కొన్ని లక్షల మందికి విద్య,వైద్య సేవలు,
సహకార,ప్రోత్సాహకాలు అందుతున్నాయి. ఇది మాములు విషయం కాదు. శాంతి,ప్రేమ,సేవల గురించి బాబా చేసిన బోధనలు ఎందరినో ఆకర్షించాయి. మత సామరస్యం,సకలజీవుల పట్ల ప్రేమ,అహింస కలిగి ఉండమని బాబా చెప్పిన మాటలు ప్రపంచానికి బహుళ ప్రయోజనాన్ని కలిగించే గొప్ప శక్తి మంత్రాలు. అబ్దుల్ కలామ్ నుంచి పివి నరసింహారావు వరకూ,గవాస్కర్ నుంచి టెండూల్కర్ వరకూ, లతా మంగేష్కర్ నుంచి పి సుశీల వరకూ,వాజ్ పేయి నుంచి మోదీ వరకూ,మన్ మోహన్ సింగ్ నుంచి టి ఎన్ శేషన్ వరకూ ఎందరెందరో పెద్దలు బాబాను గౌరవించారు, ఇష్టపడ్డారు.

బాబాతో సన్నిహితంగా మెలిగినవారికి,స్వయంగా అనుభవాలు పోగు చేసుకున్నవారికి,అనుభూతులు పొందినవారికీ, బంగారూ… అని పిలిపించుకున్న వారికీ ఆయన గురించి తెలుసు. వారిలో నాస్తికులున్నారు, తార్కికులున్నారు, మనోవైజ్ఞానశాస్త్ర నిపుణులున్నారు, పాత్రికేయులు ఉన్నారు, మేధావులున్నారు. వారందరూ ఆయనలో ఏదో ఒక ప్రత్యేకమైన శక్తి ఉందని గ్రహించినవారే కావడం బాబా విశేషం. మహిమలు మొదలైన అంశాలను అలా ఉంచగా,ఆయన వల్ల ఎందరో స్ఫూర్తి పొందారు,ఊరట పొందారు, మార్గం నిర్దేశించుకున్నారు. లక్షలాది మంది సామాన్యులకు ఎన్నో మేళ్లు జరిగాయి. ఇంకా జరుగుతూనే ఉన్నాయి. అంతటి గొప్ప వ్యవస్థను బాబా నిర్మాణం చేసివెళ్లి పోయారు. అయన దైవమా, దైవదూతా, మామూలు మనిషా..అనే విషయాలు అప్రస్తుతం. వారు నిర్మించిన వ్యవస్థల ద్వారా జాతికి జరిగే మేలు ఎప్పటికీ ప్రస్తుతం. ప్రపంచ ప్రఖ్యాతి పొందిన ఈ సత్యసాయిబాబా భారతీయుడు, మన తెలుగువాడు. అదీ మనకు గర్వకారణం. జాతిని జాగృతి వైపు,సమాజాన్ని శాంతి వైపు,మనుషుల్ని ప్రేమ, సేవల వైపు,దేశాన్ని ప్రగతి వైపు నడిపించే ఏ వ్యక్తి అయినా… ఆరాధ్యుడే. అటు వంటి వారు ఈ లోకానికి ఇంకా కావాలి, రావాలి.

(నేడు భగవాన్ సత్యసాయి జయంతి)
మాశర్మ, సీనియర్ జర్నలిస్టు

Related posts

బాల్యవివాహం ఏర్పాట్ల‌పై త‌ల్లిదండ్రుల‌కు కౌన్సెలింగ్

Sub Editor

ప్రపంచ వ్యాప్తంగా ప్రధాని మోడీకి పెరిగిన మరింత క్రేజ్‌

Sub Editor

మద్యం దుకాణాల రిజర్వేషన్ ఖరారు

Bhavani

Leave a Comment