ప్రపంచంలో ఎక్కడా దొరకని పులస చేపలు దొరికే తూర్పుగోదావరి జిల్లా కోనసీమ ప్రాంతంలోని మత్స్యకారులకు మరిన్ని సౌకర్యాలు కల్పిస్తే ఎగుమతులు పెంచుకోవచ్చునని ప్రముఖ సంఘ సేవకుడు, జిఎన్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ముత్యాల సత్యనారాయణ (సత్తిబాబు) అన్నారు. ఈ మేరకు ఆయన కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ, సమాచార ప్రసారాల శాఖ సహాయ మంత్రి లోకనాథమ్ మురుగన్ కు నేడు వినతి పత్రం అందచేశారు.
కోస్తా ప్రాంతానికి మరీ ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లా కోన సీమ ప్రాంతానికి ఒక సారి పర్యటనకు రావాలని ఆయన ఈ సందర్భంగా కేంద్ర మంత్రిని కోరారు. హైదరాబాద్ లో నేడు కేంద్ర మంత్రి మురుగన్ తో సత్తిబాబు భేటీ అయ్యారు. కోనసీమలోని మత్స్యకారుల ఆదాయం పెంచుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సాయంతో బాటు సంబంధిత అనుబంధ వ్యాపార రంగాలకు కూడా అవకాశాలు కల్పించాలని ఆయన కోరారు.
దీనివల్ల ఎగుమతులు మెరుగుపడతాయని, తద్వారా దేశానికి ఆదాయం ఒనగూరుతుందని ఆయన అన్నారు. కోనసీమ ప్రాంతంలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని, అక్కడి కొబ్బరి వ్యాపారులకు ప్రాధాన్యత కల్పించడం ద్వారా కూడా ఎగుమతులు పెంచుకోవచ్చునని సత్తిబాబు కేంద్ర మంత్రికి సూచించారు.
పర్యాటక రంగంలో విశేష ప్రాధాన్యత కల్పించాల్సిన అంశాలు కోనసీమలో లెక్కకు మంచి ఉన్నాయని ఇటీవల కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జీ.కిషన్ రెడ్డికి సత్తిబాబు వినతి పత్రం సమర్పించిన విషయం తెలిసిందే. ఇప్పుడు కేంద్ర మంత్రి మురుగన్ కు కోనసీమ సమస్యలను ఆయన వివరించారు. కోనసీమకు సందర్శించాల్సిందిగా సత్తిబాబు చేసిన వినతికి కేంద్ర మంత్రి మురుగన్ సానుకూలంగా స్పందించారు. త్వరలో కోనసీమ పర్యటనకు వస్తానని హామీ ఇచ్చారు.