కళ్లాపిచల్లి రంగవల్లులతో అందంగా అలంకరిస్తుంటే…
వాన ముసురుతో ముగ్గులన్ని కొట్టుకుపోగా..
పిల్లలూ పెద్దలూ బిక్కు బిక్కు మంటూ చేసుకున్నారు
కళాకాంతులు లేని స్వాతంత్ర్య వేడుకల్ని
కరోనా మహమ్మారి దూరం దూరం అంటుంటే..
కోవిడ్ కంటైన్మెంట్ జోన్లలో జెండాలు ఎగురవేసే అవకాశాలు లేక..
కార్యాలయాలు కార్ఖానాలు
పాఠశాలలు నాలుగు రోడ్ల కూడళ్లలో సోషల్ డిస్టెన్స్ తో మూతులకు ముక్కులకి మాస్కులతో వెల వెల పోతూ ఎగిరిన మువ్వన్నెల జెండాలు
కరచాలనాలూ ఆలింగనాలూ కరువైపోయి
సానిటైజర్ తో పదే పదే చేతులు రుద్దుకుంటూ..
నోరారా జాతీయగీతాన్ని ఆలపించలేక
గొంతారా జైహింద్ అంటూ నినాదాలు చేయలేక…
మైకు దొరికితే చాలు ఉపన్యాసాలు దంచే నేతలు కూడా
మైకు పట్టుకోడానికి భయం భయంగా …
ముందుకు రాలేక ..
మువ్వన్నెల జెండాకి సెల్యూట్ చేస్తూ పక్కన వాళ్లు మాస్కులు పెట్టుకున్నారో లేదో అనే కలవరంతో…
జెండాకి వందనాలు చేస్తూ …
స్వీట్లు పంచుదామంటే … చిన్నారులు కూడా కరోనా భయంతో దూరంగా పోతోంటే…
స్వాతంత్ర్య దినోత్సవం కళతప్పి వెలవెల పోయింది
నా జీవితంలో ఊహ తెలిసాక
జెండావందనానికి గైర్హాజరు అవ్వడం ఇదే తొలిసారి
ఒకపక్క కరోనా భయం
ఇంకోపక్క ఎడతెరిపిలేని వాన
రెండూ కలిసి మమ్మల్ని ఈ వేడుకలకి దూరం చేశాయి..
అమ్మా భరతమాతా…
నీకివే మా శతకోటి వందనాలు చెప్పుకుంటున్నా క్షమాపణలతో…..
దేవలపల్లి సునంద