ఆకలి వేసిన పేగు సాయమడిగినా
ఆత్మాభిమానం తో జాలి చూపక
వ్యాపార దృష్టితో చూసే స్వార్ధ పరులెందరో
కష్టాల కొలిమిలో కాలిపోతున్నా
అణగారి పోతున్న జీవితాలు సమ్మెట పోట్లు తింటున్నా
దయా దాక్షిణ్యాలు చూపని
కఠిన పాషాణ హృదయులెందరో
అన్యాయాలు అక్రమాల సునామీలకు బలైపోతున్నా
ఇలలో ఏ మూల వెదకినా అగుపించదు నీతి నిజాయితీ
సమస్య సుడిగుండాలను రూపు మాపని విధ్వంసులెందరో
ఈ వ్యవస్థ పుటలలో రాజకీయ చదరంగపు టెత్తులే
మతం కులం కాంక్షలతో నట్టేట ముంచుతూ
శాసకుల్లా స్వయం పాలన కావించే అవకాశ వాదులెందరో
పొరుగు వాడి క్షేమం కోరక మోసం చేసుకుంటూ
ఎవడు ఎలా పొతే నాకేమి అనుకుని
స్వలాభపేక్షకు ఆశించి ప్రతి కూల పరిస్థితులను సైతం
అవకాశంగా మార్చుకునే వారెందరో
నేడు ! ఏ మనిషిని కదిపినా రక్త కన్నీటి చరిత్రలే
అది స్వార్థపరుల పనో పెట్టుబడి దారుల పెత్తనమో
అవకాశ వాదుల తంత్రమో
మనిషి మనిషిలా ప్రవర్తించడం లేదు
ధనమేరా స్వర్గసీమలా భావించి తిరుగుతున్నారు
అవసరం తీరాక మొహం చాటేసే వారెందరో
ఏరు దాటాక తెప్ప తెగలేసే అవకాశ వాదుల
మనసులు మారి మనిషి విలువలను కాపాడినప్పుడే
మానవత్వం రాజ్యమేలేది…..
తుమ్మా రాజా, కోదాడ, సెల్ నె: 8099918883