రాదా తొందరలో ఉగాది..!
లాక్ డౌన్ కు
నేటితో ఏడాది..
అంటే పుట్టినరోజు..
ఇంతకీ మహమ్మారిపై గెలిచామా అని అడగకు.. నిలిచాము..
ఎదురు నిలిచాము…
అంతు చూడలేకపోయినా
అది మనల్ని అంతం చేయకుండా
పోరాడుతున్నాం…
కర్కశ రక్కసి వికటాట్టహాసం చేస్తే నువ్వెంత అని మనమూ పరిహాసం చేయకపోలేదు..
ఇంకా గెలవక పోయినా గెలుపుపై భరోసాను
ప్రోధి చేసుకుంటున్నాం..
కొందరి పరిస్థితిపై
విలాపం ఉన్నా
ఎన్నో గీతాలను ఆలపించుకున్నాం..
టిక్ టాక్ లు…
స్కిట్ల వినోదాలతో
కరోనా భయాన్ని గుమ్మానికి ఆవలే నిలబెట్టే
ప్రయత్నం చేసాం..
సాయం చేసుకున్నాం..
వ్యవసాయం సాగించుకున్నాం..
మనుషులం దూరంగా ఉన్నా మాధ్యమాల ద్వారా సంబంధాలను
కొనసాగించుకున్నాం..
గ్రూప్ కాల్స్ నుంచి
జూమ్ స్థాయికి ఎదిగి
మరింత మందిమి పరస్పరం
పలకరించుకున్నాం..
భూతం బయటికి పోకపోయినా బ్రతుకు ద్వారాలను ధైర్యంగా తెరిచి
దేశ పునర్నిర్మాణంలో నేను సైతం అని అందరం పాలు పంచుకుంటున్నాం..
సైకిళ్ళు పరుగులు తీస్తున్నాయి..
స్కూటర్లు
రయ్ మంటున్నాయి..
కార్లు,రైళ్లు,,విమానాలు
సైతం నడుస్తున్నాయి..
మొత్తానికి బ్రతుకు బండి
మళ్లీ ప్రయాణం మొదలెట్టింది..
అయితే..ఈ మొత్తం ప్రక్రియలో
నిర్లక్ష్యం..కేసులు పెరిగాయి..
మరణాలు బెంబేలు పుట్టిస్తున్నాయి..
ఇన్నాళ్లు ఇంట్లో బుద్ధిగా కూర్చున్న జనం
విచ్చలవిడిగా తిరుగుతున్నారు..
కరోనా వాహకులై..
ప్రవాహకులై సంచరిస్తున్నారు..
తెలిసి దేశద్రోహం..
ఆత్మద్రోహం..
పరమాత్మ ద్రోహం చేస్తున్నారు..
సడలింపు అంటే వదిలింపు
అనుకున్నారు..ఆయుష్షు కుదింపు చేసుకుంటున్నాం.. రెచ్చుబాటు మొదలు కావడంతో మళ్లీ ముంచుకొచ్చింది ముప్పు..
ఈసారి దాని పేరు సెకండ్ వేవ్!
దీన్నీ సమర్థంగా ఎదుర్కొందాం
మొన్నంత ప్రమాదం కాదు..
వచ్చిందిగా వాక్సిన్..
ఉన్నాయిగా మందులు..
కొరవడిందల్లా జాగ్రత్త..
మాస్కు ఒక్కటే
తప్పించు రిస్కు..
సామాజిక దూరం
ఇంకొన్నాళ్ళు తప్పదు..
ఇలా చేస్తే..ఇవే జాగ్రత్తలు పాటిస్తే చెక్ పెట్టడం
కాదు కష్టం..
ఓ కరోనా..
ఎల్లకాలం నీదేనా పైచేయి..
నీ రోజులు మూడే తరుణం దగ్గరలోనే..
గెలిచేది..నిలిచేది మనిషే..
సృష్టి ఆది నుంచీ సాగినది దుష్టసంహారమే..
ఈ.సురేష్ కుమార్, సీనియర్ జర్నలిస్ట్