పశ్చిమగోదావరిజిల్లా పెదవేగి మండూరు కన్నసముద్రం గ్రామంలో అగ్రవర్ణానికి చెందిన ఇద్దరు వ్యక్తుల చేతిలో ఓ దళిత రైతు హత్యకు గురైన దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండూరుకు చెందిన దళిత రైతు భీమడోలు వీర రాఘవులు మంగళవారం మండూరు కన్న సముద్రం బురద తూము ఆయకట్టు క్రింద ఉన్న నీళ్లు లేక ఎండి పోతున్న తన వరి పంటకు నీళ్లు పెట్టడానికి వెళ్ళాడు.
అదే సమయం లో కొప్పుల వారి గూడెం గ్రామానికి చెందిన ఆరుమళ్ల వల్లీరావు గోపాళం అనే ఇద్దరు అన్నదమ్ములు బురద తూముకు అతి దగ్గరలో ఉన్న తమ వరి పంటకు కూడా నీళ్లు పెట్టడానికి వెళ్లారు. అక్కడ దళిత రైతు వీర రాఘవులు కు వల్లీరావు గోపాళం అనే ఇరువురు అన్నదమ్ముల మధ్య చెరువు నీరు విషయమై ఘర్షణ ఏర్పడింది.
దీంతో తీవ్ర కోపోద్రిక్తులైన వల్లీరావు గోపాళం లు కర్రలతో దళిత రైతు వీరరాఘవులు పై ప్రాణాలు పోయేంత వరకు దాడి చేసి గాయపర్చారని తెలిసింది.
సమాచారం తెలుసుకున్నఏలూరు రూరల్ సి ఐ అనసూరి శ్రీనివాసరావు, పెదవేగి ఎస్ ఐ సుధీర్ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృత దేహాన్ని పోస్ట్ మార్టంకి ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సి ఐ శ్రీనివాసరావు.ఎస్ ఐ సుధీర్ తెలిపారు