ఎస్సి, ఎస్టీల పై జరుగుతున్న దాడులు, అత్యాచార కేసులలో పోలీస్, రెవెన్యూ శాఖలు సమన్వయంతో పనిచేసి బాధితులకు సత్వరమే న్యాయం జరిగే విధంగా చూడాలని జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటి అధ్యక్షులు, నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ సూచించారు.
బుధవారం మధ్యాహ్నం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ కి జిల్లా కలెక్టర్ అధ్యక్షత వహించగా నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు పోతుగంటి రాములు, జిల్లా ఎస్పీ కె. మనోహర్, ఆర్.డి.ఓలు, పబ్లిక్ ప్రాసిక్యూటర్, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో 2016 నుండి ఇప్పటి వరకు ఎస్సి ఎస్టీ ల పై జరిగిన దాడులు, నమోదైన కేసులు, పరిహారం, కేసు వివరాలను పరిశీలించారు.
ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎస్సి ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు అయిన వెంటనే బాధితులకు ప్రభుత్వం నుండి అందాల్సిన పరిహారం సకాలంలో అందించడం జరుగుతుందని అయితే చార్జిషీట్ వేయడం, కేసు ట్రయల్ అనంతరం పూర్తి పరిహారం అందించే విషయంలో కొంత జాప్యం జరుగుతున్నట్లు తెలిపారు. దీనిని నివారించడానికి పోలీస్, రెవెన్యూ అధికారులు ఎప్పటికప్పుడు సమన్వయంతో పనిచేసి బాధితులకు సత్వర న్యాయం, పరిహారం అందేవిధంగా చూడాలన్నారు. సమావేశంలో చర్చింన అంశాలను మినిట్స్ రికార్డు చేసి తదుపరి సమావేశంలో తీసుకున్న చర్యల యాక్షన్ టెకెన్ రిపోర్ట్ ఇవ్వాలని ఈ.డి ఎస్సి కార్పొరేషన్ అధికారిని ఆదేశించారు.
ఈ సమావేశంలో పాల్గొన్న పార్లమెంట్ సభ్యులు పి. రాములు మాట్లాడుతూ సమాజంలో అసమానతలు, అన్యాయాలను అరికట్టే విధంగా పోలీస్ అధికారులు పనిచేసి మంచి పెరు తెచ్చుకోవాలని కోరారు. ప్రతి నెలా సివిల్ రైట్స్ డే నిర్వహించాలని, పోలీస్ అధికారులు, రెవెన్యూ అధికారులు గ్రామాలను సందర్శించి దళితులకు ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకోవాలని గ్రామాల్లో ఉన్న అసమానతలను తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఎస్సి ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు అయ్యాక బాధితుల మానసిక, ఆర్థిక ఒత్తిడిలను దూరం చేసేందుకు వారికి రావాల్సిన పరిహారం సత్వరమే అందేవిధంగా చర్యలు తీసుకోవాలని తెలియజేసారు. ఉమ్మడి జిల్లాకు ఒకే ఎస్సి ఎస్టీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉండటం చేత అధిక పనిభారంతో బాధితులకు సత్వర న్యాయం జరుగకుండా కాలయాపన జరుగుతుందని అందువల్ల నాగర్ కర్నూల్ జిల్లాకు ప్రత్యేకంగా ఒక ఎస్సి ఎస్టీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ను నియమించే విధంగా ప్రతిపాదనలు పంపించాలని జిల్లా కలెక్టర్ ను సూచించారు.
ప్రజా సంఘాల నాయకులు పోలీస్ స్టేషన్ కు వసై పోలీస్ అధికారులు వారికి తగిన గౌరవం ఇచ్చి సమస్యను తెలుసుకోవాలని తెలిపారు. జిల్లా ఎస్పీ సైతం ఎస్సి ఎస్టీ ల పై దాడులు జరిగితే వారికి న్యాయం, భరోసా కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ సమావేశములో పాల్గొన్న ప్రజా సంఘాల నాయకుడు కోళ్ల శివ మాట్లాడుతూ గత సమావేశంలో లేవనెత్తిన అంశాలు పరిష్కారం అయ్యయా లేదా అనేది యాక్షన్ టెకెన్ రిపోర్ట్ ఇవ్వడం లేదన్నారు. పెద్దకొత్తపల్లి లో జరిగిన మర్డర్ కేసులో బాధితులకు ప్రభుత్వం నుండి రావలసిన పరిహారం, ఒకరికి ఉద్యోగం, పెన్షన్, 3 ఎకరాల భూమి తదితరములు ఇంకా అందలేదని కమిటీ దృష్టికి తీసుకువచ్చారు.
ఎస్సి షాపింగ్ కాంప్లెక్స్ కు రిటెండర్ వేసి అర్హులకు న్యాయం చేయాలని కోరారు. అటవీ ఏరియాలో చెంచులకు వారు తరతరాలుగా చేస్తున్న భూమి పై హక్కులు కల్పించాలని అటవీ శాఖ అధికారుల వేధింపులు ఆపాలని కోరారు. కొంతమంది ఎస్సైలు బాధితులకు సరైన న్యాయం చేయడం లేదని తప్పు చేసిన పోలీస్ అధికారులపై చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీని కోరారు.
పధర మండలం మద్దిమడుగు లో గిరిజన కుటుంబానికి పాత డెత్ సర్టిఫికెట్ జారీ చేయక పోవడం వల్ల వారి స్వంత పొలం 25 ఎకరాలు, రైతుబందు వస్తుందన్నారు. గత సమావేశంలోనే ఈ అంశాన్ని లేవనెత్తిన ఇప్పటి వరకు పరిష్కారం కాలేదని అన్నారు. ఎస్సి ఎస్టీ అట్రాసిటీ కేసులో ఇప్పటి వరకు ఏ ఒక్కరికి శిక్ష పడలేదని , దీనికి కారణం పబ్లిక్ ప్రాసిక్యూటర్ వైఫల్యమేనని అసంతృప్తిని వ్యక్తం చేశారు.
ఈ సమావేశంలో ఎస్పీ కె.మనోహర్, ఈ.డి ఎస్సి కార్పొరేషన్ అధికారి రాంలాల్, ఆర్డీఓ లు, డిఎస్పీ లు, జిల్లా వెటర్నరీ అధికారి రమేష్, పి.పి. రంభక్ష్, ప్రజా సంఘాల నాయకులు డి. ధర్మరాజు, కోళ్ల శివ,యూ. బాల్ రాజ్, యం. శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
అవుట రాజశేఖర్, సత్యంన్యూస్.నెట్, నాగర్ కర్నూల్ జిల్లా