సూరత్లోని ఓల్పాడ్ ప్రాంతంలో గురువారం ఉదయం గుజరాత్లోని సూరత్లో ఘోర ప్రమాదం తప్పింది. గ్యాస్ సిలిండర్లతో వెళ్తున్న ఓ ట్రక్ అదుపుతప్పి ఎదురుగా వస్తున్న స్కూల్ బస్సును ఢీకొంది. దీంతో భారీ పేలుడు సంభవించింది. అయితే అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదు.
బస్సును వేగంగా ఢీకొట్టడంతో ట్రక్లో ఒక్కసారిగా భారీ శబ్ధంతో పేలుడు సంభవించింది. ట్రక్లో పెద్ద సంఖ్యలో సిలిండర్లు ఉండటంతో అవన్నీ అంటుకుని భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. ఈ ప్రమాదంలో స్కూల్ బస్సుకు కూడా మంటలు అంటుకున్నాయి. అయితే విద్యార్థులను వెంటనే కిందకు దించడంతో పెను ప్రమాదం తప్పింది.
సమాచారమందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపుచేసేందుకు యత్నిస్తున్నారు. ప్రమాదంతో ఆ మార్గంలో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పేలుడు దృశ్యాలను కొందరు సోషల్మీడియాలో పోస్టు చేశారు.