వనపర్తి జిల్లా అజ్జకోల్ స్కూల్ హెడ్మాస్టర్ అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు. 8 ఏళ్లుగా అజ్జకొల్లు విద్యార్థులందరికి పరీక్ష ఫీజులను స్కూల్ హెడ్మాస్టర్ అథిక్ అహమ్మద్ చెల్లిస్తున్నారు. తన వద్ద చదివే విద్యార్ధులు డబ్బు గురించి ఆలోచించకుండా పరీక్షలు రాయాలని ఆయన కోరిక.
అందుకే పరీక్ష ఫీజులకు విద్యార్ధులు ఇబ్బంది పడకూడదని తలంచి ఆ హెడ్మాస్టర్ పరీక్ష ఫీజులను తానే చెల్లిస్తూ వచ్చారు. ఈ యేడాది మొత్తం రూ. 6420/-ల పరీక్ష ఫీజును ఆయన చెల్లించారు. హెడ్మాస్టరే అంత ఆదర్శంగా ఉంటే విద్యార్ధలు ఏం చేశారో తెలుసా? తమ గురించి ఇంతగా ఆలోచిస్తున్న ఆ హెడ్మాస్టర్ కు రిటర్న్ గిఫ్ట్ ఇస్తామంటున్నారు. వారిచ్చే రిటర్న్ గిఫ్ట్ ఏమిటంటే నూటికి నూరు శాతం ఫలితాలు సాధించి హెడ్మాస్టర్ కు “రిటర్న్ గిఫ్ట్” ఇస్తామంటున్నారు. ఇంతకన్నా ఆదర్శవంతమైన గురువు, అంతే ఆదర్శంగా ఉండే విద్యార్ధులు ఎక్కడైనా ఉంటారా?
2015 నాటి ఓ సంఘటన
పరమేశ్… ఓ ఆదర్శ విద్యార్థి. ఆత్మాభిమానం గలవాడు. అయితే నిరుపేద కుటుంబం. పరీక్ష ఫీజు చెల్లించలేని కారణంగా వారం/పది రోజులు బడికి ఆబ్సెంట్… బడికి వెళితే క్లాస్ టీచర్ ఫీజు అడుగుతారని భయం. కూలీకి వెళ్లి డబ్బులు సంపాదించి ఆ డబ్బును అతడు ఫీజుగా చెల్లించాడు దీనివల్ల చదువులో వెనుకంజ వేయాల్సి వచ్చింది. మళ్లీ చదువు మీద పట్టు సాధించేందుకు మరో వారం రోజులు పుస్తకాలతో కుస్తీ……. ప్రభుత్వ పాఠశాలలో చాలా మంది పేద విద్యార్థుల పరిస్థితి ఇలాగే ఉంటుందని అతిక్ అహమ్మద్ చెప్పారు.
ఇలాంటి విద్యార్థులెందరో “పరీక్ష ఫీజు కట్టాలి” అనగానే వివిధ కారణాలతో పాఠశాలకు సరిగా హాజరు కాకపోవడం, విద్యాభ్యాసం కూడా కుంటుబడడం జరుగుతుంది. ఇలాంటి పేద విద్యార్థుల, వారి తల్లిదండ్రుల పరిస్థితులు చూసి చలించిన ప్రధానోపాధ్యాయుడు అతీఖ్ అహ్మద్ తానే స్వయంగా 2015 వ సంవత్సరం నుండి ఇప్పటి వరకు విద్యార్థుల పరీక్ష ఫీజులు, గేమ్స్ ఫీజులను చెల్లిస్తున్నారు.
ఇంకా ఇతర స్కాలర్షిప్ ,చెకుముకి, ఎలాంటి పరీక్ష ఫీజు అయినా సరే, విద్యార్థుల నుండి వసూలు చేయకుండా తానే మొత్తం ఫీజు చెల్లిస్తున్నారు. విద్యార్థులు, క్రమశిక్షణతో మెలిగి, చదువులో, వివిధ రకాల పోటీలలో పాల్గొని రాణిస్తే చాలని, బాలల బంగారు భవిష్యత్తు కోసం, తాను చేయదగ్గ సహాయం చేస్తూ ప్రోత్సాహకాలు అందిస్తూ అండదండగా ఉంటానని ఆయన అన్నారు. దీపావళి సందర్భంగా అజ్జకొల్లు చిన్నారులకు చిరు కానుకగా ఆ ప్రధానోపాధ్యాయుడు 2022 సంవత్సరానికి గాను 6140/- (ఆరు వేల నూట నలభై రూపాయల) పరీక్ష ఫీజు & గేమ్స్ ఫీజు చెల్లించి, విద్యార్థుల పట్ల తన ఔదార్యం చాటుకున్నారు.
తమ పిల్లల పట్ల ప్రేమాభిమానాలతో, శ్రద్ధ కనబరుస్తూ ,వారి విద్యా ప్రమాణాల పెంపుకై తపిస్తూ, నిరంతరం శ్రమిస్తున్న… హెడ్ మాస్టర్ ను, ఉపాధ్యాయులను, విద్యా కమిటీ చైర్మన్ బోయ రాజు, సర్పంచ్ బ్రహ్మమ్మ సత్యం, తల్లిదండ్రులు, గ్రామస్తులు అభినందించి, వారి కృషిని, సేవలను కొనియాడారు. పాఠశాల విద్యార్థులు కూడా, తమకు అన్ని రకాల సౌలభ్యాలు కల్పించి, విద్యాభ్యాసాభివృద్ధికి, విశేష సహాయ సహకారాలు అందిస్తున్న తమ హెడ్ మాస్టర్ ఉపాధ్యాయుల, ఆశలు నెరవేర్చి 100% పరీక్షా ఫలితాలు” సాధించి వారికి “రిటర్న్ గిఫ్ట్” ఇస్తామని విద్యార్ధులు అంటున్నారు.
పొలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్