కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి వీలుగా తెలంగాణ ప్రభుత్వం ముందస్తుగా జాగ్రత్త చర్యలు చేపట్టింది. అసెంబ్లీలోని శాసనసభ కమిటీ హాల్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన కరోనాపై ఉన్నతస్థాయి కమిటీ సమావేశం జరిగింది. అనేక ప్రతిపాదనలు ఈ సమావేశంలో వచ్చాయి.
వీటిపై సాయంత్రం 6 గంటలకు ప్రగతి భవన్ లో జరిగే సమావేశంలో విస్తృతంగా చర్చిస్తారు. ఆ సమావేశంలో తుది నిర్ణయం తీసుకుంటారు. మంత్రి వర్గ సమావేశం అనంతరం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి, నిర్ణయాలను వెల్లడిస్తారు.
అసెంబ్లీ కమిటీ హాల్ లో జరిగిన సమావేశంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ డీజీపీ, వివిధ శాఖల ఉన్నతాధికారులు, జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ నెలాఖరు వరకు విద్యాసంస్థలు, థియేటర్లు, షాపింగ్ మాల్స్ మూసివేసే ప్రతిపాదన వచ్చింది.
ప్రస్తుతం జరుగుతున్న పరీక్షలు యథాతథంగా నిర్వహించాలని భావించారు. అందువల్ల ఇంటర్, టెన్త్ పరీక్షలు యథాతథంగా జరుగుతాయి.
అయితే మిగిలిన తరగతుల వారికి రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 31 వరకు అన్ని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది. మరో నాలుగు రోజుల్లో ఇంటర్ పరీక్షలు ముగియనున్న నేపథ్యంలోనే పరీక్షలను షెడ్యూల్ ప్రకారమే నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. పదో తరగతి పరీక్షలు కూడా షెడ్యూల్ ప్రకారం జరుగనున్నాయి.