జీఓ నెం 43 తో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ రిజర్వేషన్ అభ్యర్థులకు తీవ్రంగా అన్యాయం జరుగుతున్నదని మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఫారూఖ్ షిబ్లీ ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగ స్ఫూర్తికి, సుప్రీంకోర్టు తీర్పులకు, రిజర్వేషన్ల విధానానికి ఇది విరుద్ధమని ఆయన అన్నారు.
రిజర్వేషన్ కేటగిరీకి చెందిన అభ్యర్థి ఓపెన్ కేటగిరి లో ఒక కళాశాలలో సీటు పొంది, అదే కళాశాలలో గాని, లేదా ఇతర కళాశాలలో కాని, మరొక స్పెషలైజేషన్ లోకి స్టైడ్ అయితే అతడి వూర్వపు సీటును ఓపెన్ కేటగిరీ అభ్యర్థి తో భర్తీ చేస్తున్నారని ఇది అన్యాయమని ఆయన అన్నారు.
మెడికల్ అండర్ గ్రాడ్యుయేషన్ చదువులో అభ్యర్థి కళాశాలకు ప్రాధాన్యత ఇస్తాడని, కానీ పీజీ అడ్మిషన్ లలో కళాశాల కన్నా అభ్యర్థి స్పెషలైజేషన్ కు ఆధిక ప్రాధాన్యత ఇస్తాడని ఆయన అన్నారు. రిజర్వుడు అభ్యర్థి అదే స్పెషలైజేషన్ సెలెక్ట్ అయితేనే ఆ సీటును అదే రిజర్వేషన్లకు చెందిన అభ్యర్థికి కేటాయిస్తామని, వేరే స్పెషలైజేషన్లకు మారితే అతడి సీటును ఓపెన్ కేటగిరీలోనే భర్తీ చేస్తామని చెప్పడం అన్యాయమని అన్నారు.
జీఓ నెం 43 తో పాలకులు బీసీ, ఎస్సి, ఎస్టి, మైనారిటీ లను మోసం చేస్తున్నారని ఆయన అన్నారు. సుప్రీంకోర్టు పలు కేసులలో ఓపెన్ కేటగిరి లో సీటు సాధించిన రిజర్వుడు అభ్యర్థులను ఓపెన్ కేటగిరిగానే పరిగణించాలి అంతే కాని రిజర్వుడు అభ్యర్థి గా చూడకూడదని చెప్పిందని, దీని వలన 50 శాతం రిజర్వేషన్ల కోటా అధిగమించినట్లు కాదని కూడా స్పష్టం చేసిందని ఆయన అన్నారు. ఇది పేదల ప్రభుత్వం అని చెప్పుకునే ముఖ్యమంత్రి జీవోను తక్షణమే రద్దు చేయాలని ఫారూఖ్ షిబ్లీ డిమాండ్ చేశారు.