కరోనా లాక్ డౌన్ తో మందు షాపులు బంద్ అయ్యాయి. మరి ఎలా? తాగేవాడు ఏం చేయాలి? అమ్మేవాడు ఏం చేయాలి? అందుకే కొమురం భీం జిల్లా పెంచికల్పేట్ మండలంలోని వైన్ షాపుల వాళ్లు ఒక పరిష్కారం కనిపెట్టారు. ఏం లేదు సింపుల్.
తాగేవాడికి మందు కావాలి. మనకు డబ్బులు కావాలి అంతే కదా. పదండి వెళ్దాం అంటూ రాత్రి వేళలో బయలు దేరారు. సీదా షాపు దగ్గరకు వెళ్లారు. మద్యం షాపులో ఉన్న స్టాకును తీసుకోవాలి అంతే. మెల్లిగా ఎక్సయిజ్ అధికారులు తాళానికి అతికించిన సీల్ ను పీకారు.
అందులో ఉన్న ఒకడు అడిగాడు. భయ్యా మరి ఎక్సయిజ్ వాళ్లకు తెలిస్తే? అని భయం భయంగా. ఏం ఫర్లేదు భాయ్, ఆళ్లు మనోళ్లే అని సమాధానం చెప్పాడు. షాపు వాళ్లకు ఎక్సయిజ్ వాళ్లకు మధ్య ఆమాత్రం అండర్ స్టాండింగ్ లేకపోతే ఎలా? సరే తాళం తీశారు. షాపులో ఉన్న సరుకులో ఎక్కువ భాగం తరలించారు.
మళ్లీ తాళం వేశారు. దానికి సీల్ కూడా యథాతధంగా అతికించేశారు. అంతా గప్ చుప్. సాధారణ రోజుల్లో 600 రూపాయలకు అమ్మాల్సిన బాటిల్ ను 1200 అన్నారు. రెట్టింపు ధరలకు మందు అమ్మేసుకుంటున్నారు. సింపుల్. ఎక్సయిజ్ అధికారులు తెలియనట్లే ఉన్నారు.
సీల్ తీసి ఉంది, ఆదిత్యా వైన్స్ లో స్టాకు తీసి అమ్ముతున్నారు అని ఎవరైనా చెప్పినా ఎక్సయిజ్ అధికారులు మాత్రం ఏం మాట్లాడటం లేదు. పాపం అలా చేయరండీ, మేం తాళానికి సీల్ వేశాం కదా అని అంటున్నారు.
సీలు కింద నుంచి తాళం తీసేవీలుందని వారి తెలియదు. తెలిసినా అంత చూడరు. అంతే తాగేవాడికి కిక్కు, అమ్మేవాడికి లక్కు, అధికారులకు మధ్యన ఏం ఉండకుండా ఉంటుందా?
మందు స్టాకు అంతా తీసుకు వెళ్లిన బొలేరో వాహనం మాత్రం రాత్రి బాగా తాగినట్లుంది పొద్దున్నే లేవలేదు. మళ్లీ ఇటు రాలేదు.