కమిషనర్ ఉద్యోగులకు జీతాలూ ఇవ్వరు, వారి సర్వీసు నిబంధనలను యజమాయిషీ కూడా చేయరు. ప్రభుత్వ ఉద్యోగులు నేరుగా పని చేసేది రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కింద. అందువల్ల రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఏ ఆదేశం ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఇస్తారు.
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాల్సిన చట్టపరమైన అనివార్యత రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఉంటుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగస్థులు రాజకీయ కారణాలతో ఎన్నికల కమిషనర్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పనులు చేసేది లేదని భీష్మించుకు కూర్చున్నారు.
ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇచ్చే ఆదేశాలను నేరుగా ఉల్లంఘించడం కిందికే వస్తుంది. లేదూ …. ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలను ఉద్యోగులకు చెప్పలేదు… అందువల్ల వారు అలా చేస్తున్నారు… అంటూ చీఫ్ సెక్రటరీ ఉద్యోగులను కాపాడే ప్రయత్నం చేస్తే ఆయన న్యాయస్థానానికి జవాబుదారీ అవుతారు.
అప్పుడు చీఫ్ సెక్రటరీని ఎన్నికల విధుల నుంచి తప్పించే అధికారం న్యాయస్థానానికి, ఎన్నికల కమిషనర్ కు, రాష్ట్ర గవర్నర్ కు దఖలు పడుతుంది. కొత్తగా చీఫ్ సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించిన ఆదిత్యానాథ్ దాస్ ఉద్యోగులతో పని చేయిస్తారా? లేక తనను పక్కన పెట్టే వరకు తెచ్చుకుంటారా అనేది వేచిచూడాల్సిన అంశం.
ఎన్నికల ప్రక్రియ మొదలు అయిన తర్వాత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా ఎన్నికలకు సంబంధించిన విధుల వరకూ ఎన్నికల కమిషనర్ కు జవాబుదారీగానే ఉండాలి. ఇది రాజ్యాంగపరమైన అనివార్యత. తాము ఫలానా డ్యూటీ మాత్రమే చేస్తామని, ఫలానా డ్యూటీ చేయం అని చెప్పడానికి రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు ఎలాంటి హక్కు ఉండదు.
ప్రాణాలకు తెగించి మేం పని చేయాలా అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు ప్రశ్నిస్తున్నట్లు కరోనా సమయంలో పోలీసులు, వైద్యులు, పారిశుధ్య సిబ్బంది ప్రశ్నించి ఉన్నట్లయితే…….? లాక్ డౌన్ విధుల్లో ఉన్న పోలీసులు అప్పుడు తిరుగుబాటు చేసి ఉన్నట్లయితే……?????
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు రాజకీయంలో పాలుపంచుకుంటూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పై తిరుగుబాటు చేస్తున్నటు ప్రకటిస్తున్నారు. వాస్తవానికి ఇది ఎన్నికల కమిషనర్ పై తిరుగుబాటుగా చెప్పేందుకు వీలులేదు.
వారు తమ సర్వీసు నిబంధనలు అతిక్రమిస్తున్నారు. వారిపై చర్యలు తీసుకోవాల్సిన చీఫ్ సెక్రటరీ తాత్సారం చేస్తే దానికి మూల్యం ఆయనే చెల్లించుకోవాల్సి ఉంటుంది.