గుంటూరు, చిత్తూరు జిల్లాల కలెక్టర్లుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంపిన నాలుగు పేర్లను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తిప్పి పంపారు.
ఆ పేర్లను తిప్పి పంపడమే కాకుండా రాజ్యాంగం ప్రకారం తనకు సంక్రమించిన అధికారాల మేరకు చిత్తూరు జిల్లా కలెక్టర్ గా ఎం.హరినారాయణ ను గుంటూరు జిల్లా కలెక్టర్ గా పి. బసంత్ కుమార్ ను నియమించాలని ఆదేశాలు జారీ చేశారు.
అలా కాకుండా చిత్తూరు జిల్లాకు బసంత్ ను, గుంటూరు జిల్లాకు హరినారాయణను నియమించుకునే అవకాశాన్ని కూడా ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చారు.
రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండు జిల్లాలకు కలెక్టర్లుగా నియమించేందుకు పంపిన జాబితా సమగ్రంగా లేదని ఎన్నికల కమిషనర్ డాక్టర్.ఎన్.రమేష్ కుమార్ స్పష్టం చేశారు.
కేవలం తాత్కాలిక ప్రాతిపదికన కలెక్టర్లను నియమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని, ఇది పరిపాలన సజావుగా సాగేందుకు ఉపకరించదని ఆయన అభిప్రాయపడ్డారు.
అందువల్ల తాను ప్రభుత్వం పంపిన పేర్లను తిరస్కరిస్తున్నట్లు ఎన్నికల కమిషనర్ స్పష్టం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన అధికారులలో హెచ్.అరుణ్ కుమార్, వివేక్ యాదవ్ లను ఇప్పటికే జిల్లా పరిశీలకులుగా నియమించామని అందువల్ల వారిని తాను రిలీవ్ చేయలేని రమేష్ కుమార్ పేర్కొన్నారు.