దేశంలో కరోనా సెకండ్ వేవ్ మొదటి దానికన్నా వేగంగా వ్యాప్తి చెందుతున్నది. కొత్త వేరియంట్ తో విజృంభిస్తున్న సెకండ్ వేవ్ కారణంగా దేశంలో మరణాల సంఖ్య కూడా పెరుగుతున్నది.
సాధారణంగా కరోనా పాజిటీవ్ వచ్చిన తర్వాత మరణించడానికి రెండు నుంచి మూడు వారాలు పడుతుంది. తొలి దశ కరోనా కేసుల్లో మరణాల సంఖ్య 1.3 ఉండేది. వందకు 1.3 మంది మరణించేవారు.
అయితే ఇప్పుడు ఆ సంఖ్య 1.7కు పెరిగిందని పరిశోధకులు వెల్లడించారు. సెకండ్ వేవ్ అతి తీవ్రంగా ఉన్న మహారాష్ట్రలో ఈ సంఖ్య మరి కొంచెం ఎక్కువగా ఉండవచ్చునని అంచనా వేస్తున్నారు.
మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్నా ఢిల్లీలో మరణాల సంఖ్య మరింత తీవ్రంగా ఉందని కూడా ఒక అంచనా. ఢిల్లీలో మరణాల సంఖ్య 2.6 వరకూ ఉందని అంచనా వేశారు.
బ్రిటన్ వేరియంట్ కనిపించిన పంజాబ్ లో కూడా మరణాల సంఖ్య తీవ్రంగానే ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.
ఈ నెల 5వ తేదీన మరణాల సంఖ్య పంజాబ్ లో 3.4 గా నమోదు అయింది.
రోజుకు 11 వేల కేసులు నమోదు కావడం నుంచి రోజుకు 84 వేల కేసులు నమోదు కావడానికి మొదటి వేవ్ లో 85 రోజులు పట్టగా సెకండ్ వేవ్ లో కేవలం 51 రోజుల్లోనే ఆ సంఖ్యకు చేరుకున్నాము.