ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చిన రీతిలో జనతా కర్ఫ్యూను 24 గంటలు పాటించి విజయవంతం చేద్దామని ఆర్థిక మంత్రి హరీశ్ రావు పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమం లో ఎలా పాల్గొన్నామో అదే స్ఫూర్తితో కరోనాను ఎదుర్కొందామన్నారు.
తాను తన కుటుంబ సభ్యులతో ఇంట్లోనే ఉన్నట్లు ఆయన చెప్పారు. కరోనా పై ఈ యుద్దంలో విజయం సాధించి ప్రపంచానికి ఆదర్శంగా నిలుద్దామని పిలుపునిచ్చారు. స్వీయ నియంత్రణతోనే కరోనా వైరస్ ను అడ్డుకోవచ్చని చెప్పారు. చాలా దేశాలలో దేశాల్లో కరోనా వైరస్ విజృభించి ప్రజల ప్రాణాలను కబళిస్తోందన్నారు. ఈ పరిస్థితి రాకుండా చూడాల్సిన బాధ్యత మన అందరిపైన ఉందన్నారు.
ఇప్పటికే సీఎం కేసీఆర్ నిరంతరం కరోనా పరిస్థితులను సమీక్షిస్తూ అనేక చర్యలు చేపట్టారని తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన చర్యలతో పాటు ప్రజల భాగస్వామ్యంతోనే ఈ వైరస్ ను అరికట్టగలమన్నారు. స్వీయ నియంత్రణతో పాటు సబ్బుతోను, శానిటైజర్స్ తో చేతులు శుభ్రపర్చుకోవాలని సూచించారు.
జలుబు, జ్వరం, దగ్గు వంటి లక్షణాలు కనబడితే అలక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని, ప్రభుత్వానికి సమాచారం ఇవ్వాలన్నారు. సమాజ సేవ అందరి బాధ్యత , రేపు ఇంటిలో ఉండటమే మనం సమాజానికి చేసే సేవ అని హరీశ్ రావు చెప్పారు.