ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండల కేంద్రంలో గల అమరవీరుల స్తూపం వద్ద ఈనెల 9వ తేదీన కాంగ్రెస్ పార్టీ పి.సి.సి.అధ్యక్షులు రేవంత్ రెడ్డి నాయకత్వంలో… నిర్వహించబోయే ఆత్మగౌరవ సభను విజయవంతం చేయాలని ములుగు ఎమ్మెల్యే ధనసరి సీతక్క పిలుపునిచ్చారు.
దళిత గిరిజనులకు కెసిఆర్ చేస్తున్న మోసాల పై ఆత్మగౌరవ యుద్ధమే ఈ సభ అని, ఆనాడు బ్రిటిష్ వారిని దేశం నుండి పారద్రోలాడానికి గాంధీజీ ఆగస్ట్ 9 న చేపట్టిన క్విట్ ఇండియా ఉద్యమం తరహాలోనే ఈ సభ నిర్వహిస్తున్నామని ఆమె తెలిపారు. కేసీఆర్ చేస్తున్న మోసాలను వివరించేందుకు, దళిత బంధు పేరుతో చేస్తున్న మోసం, దళిత,గిరిజనుల భూములను బలవంతంగా పార్కుల పేరిట వెనక్కి తీసుకోవడం..ఇలాంటి కార్యక్రమాలను ఎండగట్టడం ఈ సభ ముఖ్య ఉద్దేశ్యమని ఆమె తెలిపారు.
మన హక్కులను మనం పొందడానికే జల్, జంగిల్, జమీన్,కోసం పోరాడి అసువులు బాసిన ఇంద్రవెళ్లి అమరవీరుల సాక్షిగా ఈ సభ నిర్వహించడం జరుగుతుంది అని సీతక్క తెలిపారు. దళిత, ఆదివాసీలు అందరూ తప్పకుండా పెద్ద ఎత్తున హాజరై సభను విజయవంతం చేయాలని ఆమె పిలుపునిచ్చారు. మన హక్కుల్ని మనం గుంజుకుందామని సీతక్క ఈ సందర్భంగా కోరారు.
నేడు ఆమె నిర్వహించిన ఈ కార్యక్రమంలో మాజీ యం.యల్.సి.కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు సాజిద్ ఖాన్, మంచిర్యాల సురేఖ ,ఆసిఫాబాద్ విశ్వ ప్రసాద్,ఊట్నూర్ జడ్పీటీసీ చారులత, నాయకులు భరత్ చౌహాన్, తలమడుగు జడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి,బజారహత్నూర్ జడ్పీటీసీ మల్లెపూల నర్సయ్య ,బోథ్,ఖానాపూర్, ఆదిలాబాద్ .. నియోజక వర్గ ముఖ్య నాయకులు, యువజన సంఘాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.