కీలకమైన శాఖలకు సంబంధించి ముఖ్య కార్యదర్శి కార్యదర్శి స్థాయి సీనియర్ ఐఏఎస్ ల బదిలీలకు రంగం సిద్ధం అయిందా? పరిస్థితులు చూస్తుంటే అలానే కనిపిస్తున్నది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల 27 మంది జూనియర్ ఐ ఏఎస్ అధికారులకు స్థాన చలనం కలిగించింది.
అనంతరం మరో పది మంది ఐపీఎస్ లను కూడా బదిలీ చేసింది. చాలా మంది సీనియర్ ఐఏఎస్ లు సమర్ధంగానే పని చేస్తున్నారు. ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆశించిన ఫలితాలు కూడా తెచ్చి పెడుతున్నారు. అయితే మంత్రులతో సఖ్యత లేని కారణంగా ముఖ్యమంత్రి వద్ద మంత్రులు ఫిర్యాదులు చేస్తున్నారు.
ఈ కారణంగా సీనియర్ ఐ ఏ ఎస్ ల బదిలీ అనివార్యం అవుతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. పదవీ విరమణ కారణంగా కొన్ని ఖాళీలు ఏర్పడ్డాయి. వాటిని కూడా భర్తీ చేయాల్సి ఉంది. అలాగే ఆయా శాఖలలో రెండు సంవత్సరాలు పూర్తి చేసిన అధికారులు, టీడీపీ హయాం నుంచి కొనసాగుతున్న అధికారులకు స్థాన చలనం కలగనుంది.
మంత్రులు, అధికారుల మధ్య అవగాహన కొరవడటం వల్ల కొన్ని శాఖల్లో ప్రతిష్టంభన ఏర్పడింది. మంత్రి వర్గంలో చాలా మందికి ఆయా శాఖలపై పూర్తి స్థాయి అవగాహన లేక పోవడం, కొన్ని శాఖల్లో సీనియర్ అధికారులు ఉండడంతో మంత్రుల మాటను సీనియర్లు వినడం లేదనే ఫిర్యాదులు ఉన్నాయి. కొందరు అధికారులు నేరుగా ముఖ్యమంత్రితోనే చర్చిస్తున్నందున మంత్రుల మాట వినడం లేదు.
ఇలా ఐదు శాఖల మంత్రులు ముఖ్యమంత్రికి ఫిర్యాదులు చేశారని తెలిసింది. దీనితో బాటు వివిధ కారణాలతో పౌరసరఫరాలు, రెవెన్యూ, వ్యవసాయం, ఆర్థిక, వాణిజ్యం, ఎక్సైజు, మునిసిపల్, దేవాదాయ, కార్మిక శాఖ, విద్యాశాఖ, సంక్షేమ శాఖలకు సంబంధించిన సీనియర్ ఐ ఏఎస్ అధికారులకు స్థాన చలనం కలిగే అవకాశం ఉంది.
తమ శాఖతో పాటు అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న అధికారులకు ఈ బదిలీల్లో ఆదనవు శాఖలకు అధికారులను నియమించనున్నారు. ప్రస్తుతం ప్రాధాన్యత లేని శాఖల్లో పనిచేస్తున్న అధికారులు ఫోకస్ శాఖలకు వచ్చేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి జగన్ అన్ని విషయాలు బేరీజు వేసుకుని అధికారులకు స్థాన చలనం కలిగించనున్నారు. మొత్తం మీద ఈ వారంలో భారీగా ఐ ఏఎస్ అధికారుల బదిలీ జరుగనుంది.