ఏపీలో మావోయిస్టులకు గట్టి దెబ్బ తగిలింది. పోలీసులకు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. అదీ విశాఖ జిల్లా కొయ్యూరు మండలం మంప పోలీస్ స్టేషన్ పరిధిలో. తీగలమెట్ట వద్ద గ్రేహౌండ్స్ దళాలు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.
ఈ ఘటనలో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. తీగలమెట్ట మావోయిస్టులు ఉన్నారన్న సమచారంతో మంప పీఎస్ పరిధిలో గ్రేహౌండ్స్ పోలీసులు కూంబింగ్ చేపట్టారు. దీంతో తెల్లవారుజామున ఇరు వర్గాల మధ్య కాల్పులు జరిగాయి.
ఎవరెవరు… చనిపోయారు.. ఎంత మంది గాయపడ్డారో తెలియాల్సి ఉందని కొయ్యూరు సీఐ వెంకటరమణ తెలిపారు. దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో వివరాలు తెలియడానికి సమయం పడుతుందని వివరించారు.
ప్రస్తుతం ఈ ప్రాంతంలో కూంబింగ్ కొనసాగుతోందని చెప్పారు. ఘటనాస్థలికి అదనపు బలగాలను తరలిస్తున్నామన్నారు. ఘటనాస్థలిలో ఏకే- 47, తుపాకులు లభ్యమయ్యాయని పోలీసులు తెలిపారు.
మావోయిస్టు అగ్ర నేతలు తప్పించుకున్నారన్న సమాచారంతో హెలికాప్టర్ సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు.