ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న దేవాలయాలపై దాడులను హిందూ ధర్మాన్ని అనుసరించే పీఠాధిపతులు సీరియస్ గా తీసుకున్నట్లే కనిపిస్తున్నది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కప్పదాటు వైఖరిని ఎండగట్టాలని కూడా పీఠాధిపతులు తీవ్రంగా యోచిస్తున్నారు.
ఈ దశలో జరిగిన పీఠాధిపతుల కీలక సమావేశం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఏపీ, తమిళనాడు సరిహద్దులోని ఓ గ్రామంలో పీఠాధిపతులు సమావేశం ఏర్పాటు చేసుకున్నట్టు తెలిసింది. ఈ సమావేశానికి బీజేపీ, ఆర్ఎస్ఎస్, వీహెచ్పీ పెద్దలు కూడా హాజరయ్యారని విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఇంటెలిజెన్స్ కన్ను పడకుండా ఉండేందుకు రహస్య ప్రదేశంలో ఈ సమావేశం నిర్వహించడం ఇక్కడ గమనార్హం. ఆంధ్రప్రదేశ్ లో ఆలయాల దాడులు పెరిగిపోవడమే కాకుండా దాదాపుగా అన్ని చోట్లా బలవంతపు మత మార్పిడులు జరుగుతున్నాయి.
బాహాటంగానే మత మార్పిడులు చేస్తున్నా రాష్ట్రంలోని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. పట్టించుకోవడం మాట దేవుడెరుగు మత మార్పిడులను అధికారికంగా ప్రోత్సహిస్తున్నట్లు కూడా ఇప్పటికే ఫిర్యాదులు వెల్లువెత్తాయి. వీటన్నింటికి వ్యతిరేకంగా వీరు సమావేశమైనట్టు తెలుస్తోంది.
సమావేశానికి దేశంలోని ముఖ్య పీఠాధిపతులు హాజరయ్యారని సమాచారం. ఆలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసంతో పాటు మతమార్పిడులను జగన్ ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని ఆగ్రహంతో ఉన్న సంఘ్ పరివార్, ఈ భేటీ ద్వారా హెచ్చరిక చేయాలన్న యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.