రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కామారెడ్డి మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగురవేయడం ఖాయమని మాజీ మంత్రి షబ్బీర్ అలీ ధీమా వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నేడు జిల్లా కేంద్రంలోని క్లాసిక్ గోల్డెన్ ఫంక్షన్ హల్ లో నియోజక వర్గ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి షబ్బీర్ అలీ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గత నాలుగు పర్యాయాలు కామారెడ్డి మున్సిపాలిటీపై కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేసామని గుర్తు చేశారు. ఈ ఎన్నికల్లో కూడా జెండా ఎగురవేయడం ఖాయమని చెప్పారు. కామారెడ్డి పట్టణంలో తన హయాంలో జరిగిన అభివృద్ధి మాత్రమే కనపడుతుందన్నారు. కొత్తగా జరిగిన అభివృద్ధి ఏమి లేదని చెప్పారు.
అధికారంలో ఉన్నారా లేదా అని చూడకుండా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని పట్టణ ప్రజలను కోరారు. అవినీతి లేని పాలన సాగేలా తాను ముందుంటానని చెప్పారు. మున్సిపాలిటీలో గెలిపించి ప్రభుత్వాన్ని ప్రశ్నించే అవకాశం కల్పించాలని ప్రజలను కోరారు. అధికారంలో ఉన్నా లేకున్నా కామారెడ్డి అభివృద్ధి కోసం తన ప్రాణం ఉన్నంత వరకు కృషి చేస్తానని స్పష్టం చేశారు.
కార్యకర్తల సమిష్టి కృషితో ఎన్నికల్లో గెలుపొందెలా ముందుకు వెళ్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే యూసుఫ్ అలీ, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాసరావు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.