సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ మఠంపల్లి మండల మట్టపల్లి మహా పుణ్య క్షేత్రంలోని పవిత్ర కృష్ణానది గలగలా సవ్వడుల నడుమ శ్రీ లక్ష్మీనృసింహ వేద,స్మార్త పాఠశాల ప్రాంగణంలో శ్రీ దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవములు అత్యంత శోభాయమానంగా ప్రారంభమయ్యాయి.
శ్రీ లక్ష్మీనృసింహ వేద స్మార్త పాఠశాల అధ్యాపకులు చీమలపాటి ఫణి శర్మ ఘనాపాటి నేతృత్వంలో శ్రీ దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సోమవారం మొదటి రోజు గణపతి పూజ, పుణ్యాహవాచనము,రక్షాబంధనం, కలశస్థాపనతో అంకురారోపణ వేద,స్మార్త విద్యార్థుల మంత్రోచ్ఛారణల మధ్య కల్పోప్తంగా ప్రారంభమయ్యాయి.
ముప్పది మంది వేద,స్మార్త విద్యార్థులు ముక్తకంఠంతో మహన్యాస పూర్వక, నమ్మక,చమక సహిత,పంచసూక్తాలతో, పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం నూతన పట్టు వస్త్రాలతో అలంకరించి,దుర్గామాతను ప్రాణ ప్రతిష్ట గావించి,షోడశోపచారాలతో అర్చించి,శ్రీ దుర్గా సహస్రనామాలతో పూజించి,ధూప,దీప,నైవేద్యాలు సమర్పించి మహా నిరాజన మంత్రపుష్పం వేద స్వరానుగుణంగా అమ్మవారికి సమర్పించి తీర్థ,ప్రసాద వితరణ గావించారు.
ప్రదోషకాల సమయంలో శ్రీ దుర్గామాతను షోడశోపచారాలతో పూజించి ధూప దీప నైవేద్య మహానీరాజన మంత్రపుష్పాలు సమర్పించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీనరసింహ వేద,స్మార్త పాఠశాల అధ్యాపకులు చీమలపాటి ఫణి శర్మ ఘనాపాటి మాట్లాడుతూ శ్రీ దుర్గామాత శరన్నవరాత్రి ఉత్సవాలలో తొమ్మిది రోజులు ఉదయం ప్రదోషకాల సమయంలో నిత్య పూజలు నిర్వహించడమే కాకుండా మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం కూడా జరుగుతుందని అన్నారు.నవరాత్రులలో చండీ హోమం నిర్వహించబడుతుందని తెలిపారు.భక్తులు ఇట్టి కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని సేవించి,తరించాలని ఫణి శర్మ ఒక ప్రకటనలో కోరారు.
ఈ కార్యక్రమంలో శ్రీ మట్టపల్లి లక్ష్మీనృసింహ బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రం కమిటీ సభ్యులు,వేద,స్మార్త పాఠశాల విద్యార్థులు,వారి తల్లిదండ్రులు,భక్తులు తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్ హుజూర్ నగర్