తెలంగాణలో పార్టీ పెట్టడం వల్ల ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయోజనాలు దెబ్బతింటాయని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పినా ఆయన చెల్లెలు షర్మిలారెడ్డి వినలేదా?
వినలేదనే వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుడు, ముఖ్యమంత్రి సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి చెబుతున్నారు. అయితే తన అన్న ఆశీస్సులు తనకు పుష్కలంగా ఉన్నాయనే షర్మిలారెడ్డి చెబుతున్నారు.
కొత్త పార్టీ పెట్టేందుకు తన అన్న ఆశీస్సులు ఉన్నట్లు షర్మిలారెడ్డి చెబుతుంటే సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రం అందుకు భిన్నంగా చెబుతున్నారు. తెలంగాణాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలా ఉండాలో ఆలోచనలు నడుస్తున్నాయని కూడా సజ్జల అంటున్నారు.
తెలంగాణలోని వైఎస్సార్ అభిమానులకు ఆకాంక్షలు చాలా ఉన్నాయని ఆయన తెలిపారు. రెండు రాష్ట్రాలు సమన్వయంతో, సహకారంతో చేయాల్సినవి చాలా ఉంటాయని, ఈ నేపథ్యంలో అక్కడికి వెళితే రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటాయని, తెలంగాణ వెళ్ల వద్దని వై ఎస్ జగన్ చెప్పారని సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు.
షర్మిలా రెడ్డి పార్టీ గురించి మూడు నెలలుగా చర్చలు జరుగుతున్నట్లు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. అన్నా చెల్లెళ్ళ మధ్య విభేదాలు లేవు..కేవలం పార్టీ విస్తరణపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. షర్మిలమ్మకు నచ్చజెప్పే ప్రయత్నం జరిగిన మాట వాస్తవం. ఆమె నిర్ణయానికి ఆమె బాద్యులు అవుతారు..ఫలితాలు ఏమైనా ఆమెకే వస్తాయి అని ఆయన వ్యాఖ్యానించారు.