తెలంగాణలో రాజకీయ పార్టీ ప్రారంభించి సీఎం కేసీఆర్ పై అనునిత్యం దుమ్మెత్తిపోస్తున్న వై ఎస్ షర్మిల త్వరలో కాంగ్రెస్ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీతో సమావేశం కానున్నారా? విశ్వసనీయ సమాచారం మేరకు రాహుల్ గాంధీతో వచ్చే నెల మొదటి వారంలో షర్మిల సమావేశం కానున్నారు.
ఇప్పటికే షర్మిలతో కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా టెలిఫోన్ లో సంభాషించారు. కర్నాటక కాంగ్రెస్ పార్టీని విజయతీరాలకు చేర్చిన డి కె శివకుమార్ తో షర్మిల తరచూ భేటీ అవుతున్నారు. ఆయనను బెంగళూరులో కలిసి చాలా సేపు రాజకీయాలపై చర్చలు జరిపిన షర్మిలకు ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చినట్లు చెబుతున్నారు.
ప్రాధమికంగా జరిగిన చర్చల ప్రకారం తెలంగాణ లో షర్మిల పార్టీ కాంగ్రెస్ తో ఎన్నికల పొత్తు పెట్టుకుంటుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ తో కలిసి పోటీ చేసిన అనంతరం వచ్చిన ఫలితాలను బట్టి తదుపరి కార్యాచరణ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు ఒకే సారి వస్తాయి.
తెలంగాణ లో జరిగే లోక్ సభ ఎన్నికలలో గతంలో కాంగ్రెస్ పార్టీ మూడు స్థానాలు గెలుచుకున్నది. ఆంధ్రాలో ఒక్క స్థానం కూడా రాలేదు. రాబోయే లోక్ సభ ఎన్నికలలో తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల నుంచి కనీసం 10 స్థానాలు గెలుచుకోవాలనేది కాంగ్రెస్ పార్టీ లక్ష్యం గా చెబుతున్నారు. అందుకోసం షర్మిల ఉపయోగపడేందుకు అంగీకరిస్తే
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో షర్మిలకు కాంగ్రెస్ పార్టీ విశేష ప్రాధాన్యత ఇస్తుంది. అలా కాకుండా ఏపిలోనే తనకు ప్రాధాన్యత కావాలి అని షర్మిల అనుకుంటే అందుకు కూడా కాంగ్రెస్ పార్టీ సంసిద్ధత వ్యక్తం చేసింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత తనకు ఏది కావాలో కోరుకుంటే ఆ విధంగా వెసులు బాటు కల్పించేందుకు కాంగ్రెస్ పార్టీ
‘‘ఓపెన్ ఆఫర్’’ ఇచ్చిందని అంటున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ తో అవగాహనకు షర్మిల ప్రాధమికంగా అంగీకరించారని అంటున్నారు. షర్మిల ప్రాధమికంగా అంగీకరించినందున రాహుల్ గాంధీ కూడా ఆమెను కలిసేందుకు సమ్మతించారని అంటున్నారు. షర్మిల రాహుల్ గాంధీల సమావేశం అనంతరం చర్చలు తుది రూపునకు వస్తాయని విశ్వసనీయ వర్గాల సమాచారం.