కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీకి దిక్కుగా ఉన్న రామసుబ్బారెడ్డి త్వరలో వైసీపీ లో చేరబోతున్నారు. రామసుబ్బారెడ్డి వీడిపోతే తెలుగుదేశం పార్టీకి ఇక ఆ జిల్లాలో దిక్కుమొక్కు కూడా ఉండదు. తెలుగుదేశం పార్టీ కుటుంబంగా పేరు పొందిన రామసుబ్బారెడ్డి వైసీపీలో చేరడం ఇప్పుడు లాంఛనంగానే కనిపిస్తున్నది.
ప్రస్తుత జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి రామసుబ్బారెడ్డి వైసీపీలో చేరేందుకు అభ్యంతరం వ్యక్తం చేయగా ఇది సిఎం జగన్ నిర్ణయమని ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి కరాఖండిగా చెప్పేశారు. దాంతో కడప జిల్లా పర్యటనకు వచ్చిన సజ్జల అప్పగించిన పనిని చేసుకుని వెళుతున్నారని అంటున్నారు.
రామసుబ్బారెడ్డి పార్టీ మారితే కడప రాజకీయాల్లో పెను సంచలనాలకు వేదిక అవుతుంది. వైసీపీలో చేరే అంశంపై కార్యకర్తలు ముఖ్య నేతలతో రామసుబ్బారెడ్డి సమావేశం అయ్యారు. తుది నిర్ణయం కూడా తీసుకున్నట్లు కనిపిస్తున్నది.
మొన్నటికి మొన్న మండలిలో వైసీపీ కి మద్దతు పలికిన టీడీపీ ఎమ్మెల్సీ దేవగుడి శివనాధ రెడ్డి కి, వైసీపీ అండగా ఉంటుందనుకున్న దేవగుడి సోదరులకు భారీ షాక్ ఇచ్చింది. రామసుబ్బారెడ్డి వైసీపి తీర్థం పుచ్చుకోనుండటం పై జిల్లా అంతటా ఆసక్తి నెలకొంది. స్టానిక ఎన్నికల్లో బలం పెంచుకోవడం తో పాటు జిల్లాలో ఏకగ్రీవాల కోసమే వైసీపీ ప్రయత్నాలు సాగిస్తోంది.