హైదరాబాద్ లోని సైదాబాద్ సింగరేణి కాలనీలోని పేదలకు ఇచ్చిన ప్రభుత్వ నివాస సముదాయాలకు లక్షల్లో కరెంటు బిల్లు వస్తున్నది. దాంతో నివాసితులు లబోదిబోమంటున్నారు. ఐఎస్ సదన్ డివిజన్ సింగరేణి కాలనీ లోని వాంబే గృహాలలో నివాసం ఉండే వారు రెక్కాడితే డొక్కాడని పేద కుటుంబాలు. అక్కడ మొత్తం పదిహేను వందలకు పైగా పేద కుటుంబాలు ఉంటాయి.
నివాసం ఉండే వారికి ఒక్కోకుటుంబానికి 50 వేల నుండి లక్ష రూపాయల వరకు కరెంట్ బిల్లు రావడంతో అందరూ ఒక్కసారిగా అవాక్కై రోడ్డుమీదకు వచ్చారు. ప్రభుత్వం కేటాయించిన ఇంటి ఖరీదు కంటే కరెంటు బిల్లులు ఎక్కువగా వస్తున్నాయంటూ , తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ , తమ ఆవేదన వ్యక్తం చేస్తూ సింగరేణి కాలనీ నుండి ర్యాలీగా వచ్చి సాగర్ ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా చేపట్టారు. అధికంగా వచ్చిన కరెంటు బిల్లులును వెంటనే రద్దుచేసేంత వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు.