గుజరాత్ ఎన్నికల పోరు ఉత్కంఠగా సాగుతోంది. బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలతో బాటు అసదుద్దీన్ ఒవైసీకి చెందిన ఏఐఎంఐఎం కూడా ఇక్కడ క్రియాశీలకంగా మారాయి. మరోవైపు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మపై ఒవైసీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. శ్రద్ధా హత్య కేసును లవ్ జిహాద్గా అభివర్ణించిన బిస్వా శర్మ మానసిక వ్యాధి తో బాధపడుతున్నాడని ఎద్దేవా చేశారు. గుజరాత్లో ఒక ర్యాలీలో ప్రసంగిస్తూ, లవ్ జిహాద్ కారణంగానే శ్రద్ధ వాకర్ అనే యువతిని దక్షిణ ఢిల్లీలో హత్య చేశారని శర్మ ఆరోపించడం అన్యాయమని ఒవైసీ అన్నారు.
బీజేపీ వాళ్లు పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని అన్నారు. ఈ వ్యవహారానికి మత రంగు పులిమేందుకు ప్రయత్నిస్తున్నారని, హిమంత బిశ్వ శర్మ శ్రద్ధ హత్య ఉదంతంపై రాజకీయ క్రీడలు ఆడుతున్నారని ఆయన అన్నారు. దేశంలో మహిళలపై నేరాలు జరగడానికి పురుషుల అనారోగ్య మనస్తత్వమే కారణమని ఒవైసీ అన్నారు. శ్రద్ధా హత్యకేసు మాత్రమే కాదు కాదు, ఆజంగఢ్లో బాలిక ను ఆరు ముక్కలు చేసిన సంఘటన, ఢిల్లీలో డ్రగ్స్కు బానిసై తల్లిదండ్రులను చంపేసిన సంఘటనపై బీజేపీ వాళ్లు ఎందుకు మాట్లాడరు? అంటూ ఆయన ప్రశ్నించారు. మహిళలపై నేరాలను అరికట్టాల్సిన అవసరం ఉందని ఐక్యరాజ్యసమితి కూడా చెప్పిందని ఆయన అన్నారు. కానీ, బీజేపీ మాత్రం ముస్లింలపై విద్వేషం సృష్టించాలనుకుంటోంది అని ఒవైసీ అన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఆరోపణపై ఒవైసీ కూడా
బదులిచ్చారు. గుజరాత్కు వచ్చి ఆటను చెడగొడుతున్నామని కాంగ్రెస్ చెబుతోందని, అయితే అమేథీలో ఎందుకు ఓడిపోయారో రాహుల్ గాంధీ చెప్పాలని అన్నారు. తాము అక్కడ పోటీ చేయలేదని ఆయన గుర్తు చేశారు. హైదరాబాద్లో కాంగ్రెస్ మాపై పోరాడితే మేం ఏడవడం లేదని ఒవైసీ అన్నారు. ఒక ర్యాలీలో అసదుద్దీన్ ఒవైసీ నిరుద్యోగంపై ప్రధాని నరేంద్ర మోదీని దుయ్యబట్టారు.