సీనియర్ ఐఏఎస్ అధికారులతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెలగాటం ఆడుతున్నది. రాష్ట్ర క్యాడర్ లోనే అత్యంత సీనియర్ అయిన ఒక అధికారిని అత్యున్నత స్థానంలో కేవలం ఒకే ఒక రోజు ఉంచి తీసేశారు. అదే విధంగా మరో సీనియర్ ఐఏఎస్ అధికారిని ఒక రోజు పాటు ఎక్కడా పోస్టింగ్ లేకుండా ఉంచేశారు.
ఆంధ్రప్రదేశ్ లోనే కాదు దేశంలో ఎక్కడా, ఏ రాష్ట్రంలో కూడా ఈ విధంగా జరిగి ఉండకపోవచ్చు. సీనియర్ ఐఏఎస్ అధికారి అయిన నీరబ్ కుమార్ ప్రసాద్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత సీనియర్ అధికారి. ఆయన స్పెషల్ చీఫ్ సెక్రటరీ స్థాయిలో పర్యావరణం, శాస్త్ర సాంకేతిక, అటవీ శాఖలు పర్యవేక్షించేవారు.
ఆయనకు అదనంగా చీఫ్ కమిషనర్ ఆఫ్ లాండ్ అడ్మినిస్ట్రేషన్ (భూ పరిపాలన చీఫ్ కమిషనర్) పోస్టు నిర్వహించేవారు. ఏం జరిగిందో ఏమో కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయనను అకస్మాత్తుగా అన్ని స్థానాల నుంచి తప్పించేస్తూ ఆయనకు కూడా తెలియకుండా ఆదేశాలు జారీ చేసింది.
దాంతో హతాశుడైన ఆయన తన విషయం ఎవరికి చెప్పుకోవాలో అర్ధం కాక నిశ్శబ్దంగా ఉండిపోయారు. ఆయన అప్పటి వరకూ నిర్వహించిన అన్ని పోస్టులను మరో అత్యంత సీనియర్ ఐఏఎస్ అధికారి అయిన ఆదిత్యానాథ్ దాస్ కు అప్పగించారు.
పాత సాంప్రదాయం ఏమౌతుందో
పర్యావరణం, శాస్త్ర సాంకేతిక, అటవీశాఖలతో బాటు భూ పరిపాలన చీఫ్ కమిషనర్ పోస్టును ఆదిత్యానాథ్ దాస్ కు కేటాయిస్తూ ప్రభుత్వ ఆదేశాలు వెలువడ్డాయి. భూ పరిపాలన కమిషనర్ గా నిర్వహించే అధికారిని తదుపరి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించే సాంప్రదాయం ఉంది.
దాంతో ఆదిత్యానాథ్ తో సహా అందరూ ఇంకేముంది తదుపరి చీఫ్ సెక్రటరీ ఆదిత్యానాథ్ దాస్ అని ఫిక్సయిపోయారు. ఇది జరిగి 24 గంటలు గడవక ముందే మరో ఆదేశం వచ్చింది. అదేమిటంటే భూ పరిపాలన కమిషనర్ గా నీరబ్ కుమార్ ప్రసాద్ ను నియమించారు.
ఇదేమిటి నిన్ననే కదా తీసేశారు, మళ్లీ అదే పోస్టులో వేయడం ఏమిటి అంటూ పరిపాలన గురించి తెలిసిన వాళ్లే తలలు బద్దలు కొట్టు కున్నారు. ఆదిత్యానాథ్ దాస్ కు పర్యావరణం, శాస్త్ర సాంకేతిక, అటవీ శాఖ లు మాత్రమే ఉంచారు. అప్పటి వరకూ అదనపు శాఖగా నిర్వహించిన నీరబ్ కుమార్ ప్రసాద్ కే భూ పరిపాలన చీఫ్ కమిషనర్ పూర్తి బాధ్యతలు అప్పగించారు.
ఒక్క రోజులో ఓడలు బండ్లు, బండ్లు ఓడలు కావడం అంటే ఇదే మరి అంటూ అందరూ విస్మయం వ్యక్తం చేస్తున్నారు. మరి గత సాంప్రదాయం ప్రకారం భూ పరిపాలనా కమిషనర్ ను తదుపరి చీఫ్ సెక్రటరీగా చేస్తారా? ఏమో తెలియదు. ఆదిత్యానాథ్ దాస్ కు చీఫ్ సెక్రటరీ పోస్టు ఇస్తామని హామీ ఇచ్చి ఒక్క రోజులోనే ఇచ్చిన పోస్టును పీకేశారట.
ప్రస్తుత చీఫ్ సెక్రటరీ నీలం సహానీ పదవీ కాలం పూర్తి అయిన తర్వాత ఆదిత్యానాథ్ దాస్ చీఫ్ సెక్రటరీ అవుతారా? నీరబ్ కుమార్ ప్రసాద్ చీఫ్ సెక్రటరీ అవుతారో తెలియక అందరూ తికమకపడుతున్నారు. ఐఏఎస్ అధికారులతో సహా.