సింహాచలం శ్రీలక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం ప్రధాన అర్చకుడు గొడవర్తి గోపాలకృష్ణమాచార్యుల సమస్య సెటిల్ అయింది. విశాఖ శారదా పీఠం స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి చొరవ తీసుకుని ప్రధాన అర్చకుడిని మళ్లీ విధుల్లో నియమించే విధంగా చేశారు.
శ్రీలక్ష్మీ నరసింహ స్వామి కొలువుదీరిన సింహగిరిపై చందనోత్సవ వేళ నిబంధనలకు విరుద్ధంగా ఒక వ్యక్తిని అప్పన్న నిజరూప దర్శనానికి తీసుకువెళ్లినట్లు ప్రధాన అర్చకుడిపై ఆరోపణలు వచ్చాయి. సింహాచలం ఈవో స్పందిస్తూ దీనికి ప్రధానార్చకుడు గొడవర్తి గోపాలకృష్ణమాచార్యులే కారణమని భావించారు.
ఆలయ వర్గాల సమాచారం మేరకు ఈఓ ఈ నిర్ణయం తీసుకున్నారు. అనుమతి లేని వ్యక్తి నిజరూప దర్శనానికి వెళ్లిన వివాదం మీడియాలో ప్రముఖంగా రావడంతో ప్రాథమిక సమాచారాన్ని ఆధారంగా చేసుకుని ప్రధానార్చకుడి పై సస్పెన్షన్ వేటు వేశారు.
తన సస్పెన్షన్ వేటును వ్యతిరేకిస్తూ ప్రధానార్చకుడు తక్షణం విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్రను కలిసారు. తన తప్పేమీ లేదని వివరణ ఇచ్చారు. దీనిపై స్పందించిన స్వామి స్వరూపానందేంద్ర తక్షణం దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తో మాట్లాడారు.
ప్రాథమిక సమాచారాన్ని ఆధారంగా చేసుకుని సస్పెన్షన్ వేయడం సమంజసంగా లేదని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. స్వామిజీ చొరవతో మంత్రి శ్రీనివాస్ స్పందించి ప్రధాన అర్చకుడిపై సస్పెన్షన్ వేటను ఉపసంహరించాలని అధికారులను ఆదేశించారు.