సింగరేణి సంస్థలో పనిచేసే పదవి విరమణ పొందిన ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు భాగమహేమంతరావు ప్రభుత్వాన్ని కోరారు. సిపిఐ కార్యాలయంలో జరిగిన సింగరేణి కాలరీస్ రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ సభ్యుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ 1989వ సంవత్సరంలో మనబోతుల కొమరయ్య నాయకత్వాన సింగరేణిలో పనిచేసే ఉద్యోగులకు పెన్షన్ కావాలని పోరాటం జరిగిందని, ఆ పోరాట ఫలితమే ప్రస్తుతం ఉద్యోగులకు వస్తున్న పెన్షన్ అని ఆయన తెలియజేశారు. 1998వ సంవత్సరం నుండి నేటి వరకు అదే పెన్షన్ ఇప్పటికీ ఇస్తున్నారన్నారు. 1998 లో పెన్షన్ మంజూరు అయినప్పుడు 350 రూపాయలు ఉంటే నేటికీ అదే పెన్షన్ కొనసాగటం దారుణమైన విషయం అన్నారు. సింగరేణి ప్రకటించిన హెల్త్ కార్డుల విషయమై కూడా ఖమ్మంలోని హాస్పిటల్లో స్పందించడం లేదని, వాళ్లు పెట్టుకున్న రియంబర్స్మెంట్ను కూడా ఇవ్వడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
రిటైర్డ్ ఉద్యోగులకు ఆసరా పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాబోయే రోజుల్లో రిటైర్డ్ ఉద్యోగులకు అండగా ఉంటామని ఆయన ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఉద్యోగుల పెన్షన్ విషయమై వేజ్ బోర్డు కమిటీ పర్మనెంట్ సభ్యులు వాసిరెడ్డి సీతారామయ్యతో చర్చిస్తామన్నారు . ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్, సింగరేణి కాలరీస్ రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ బాధ్యులు మిరియాల రంగయ్య అధ్యక్షులు నల్లమోతు వెంకటేశ్వరరావు, నాయకులు చావా వెంకటేశ్వరరావు, వసంతరావు, ఎన్ అంజయ్య, కోటేశ్వరరావు రైతు సంఘం నాయకులు జమ్ముల జితేందర్ రెడ్డి, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోట రామాంజనేయులు, జిల్లా నాయకులు కోటేశ్వరరావు, సత్యనారాయణ, రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.