ఉత్తరాంధ్ర కల్పవల్లి శ్రీశ్రీశ్రీ పైడితల్లి అమ్మవారి జాతరలో వినియోగించే సిరిమాను విజయనగరం చేరింది. డెంకాడ మండలం చందకపేట చింత చెట్టు ను సిరిమానుగా తీర్చిదిద్దమని పూజారి కలలో కనిపించి అమ్మవారు చెప్పింది. అమ్మవారి కోరిక ప్రకారం ఆ చింత చెట్టు కు జిల్లా కలెక్టర్ సూర్యకుమారి పూజ చేసారు.
శాస్త్రోక్తంగా జరిగిన ఈ కార్యక్రమాన్ని దేవాదాయ ధర్మాదాయ శాఖ కమీషనర్ కిషోర్ కుమార్ పర్యవేక్షించారు. అనంతరం నగర డీఎస్పీ అనిల్ సమక్షంలో సీఐ మంగవేణి, ఎస్ఐలు నారాయణ, ప్రసాద్ ,శోభన్ బాబు లతో పాటు పోలీసు బందోబస్తు తో దాదాపు 12 గంటల పాటు సిరిమాను చెట్టు ఊరేగింపు జరిగింది. మధ్యాహ్నం 2 గంటలకు చందకపేట నుంచీ మేళతాళాలతో బయలుదేరారు.
జమ్ము సమీపంలో సింగపూర్ సిటీ వద్ద ట్రాఫిక్ డీఎస్పీ మోహన్ రావు ,ఎస్ఐలు హరిబాబు, ఏఎస్ఐ లు నూకరాజు ఇతర ట్రాఫిక్ సిబ్బంది సిరిమాను చెట్టును నగరంలో తీసుకువచ్చే యత్నం చేశారు. దాసన్నపేట రింగ్ రోడ్ వద్ద సిరిమాను చెట్టుకు స్వాగతం పలకగా అక్కడ నుంచీ రింగు రోడ్ ఐస్ ఫ్యాక్టరీ, బాలాజీ జంక్షన్, ఆర్టీసీ కాంప్లెక్స్, మయూరీ జంక్షన్, వనంగుడి ,సీఎంఆర్ , కన్యకాపరమేశ్వరీ టెంపుల్, గంటస్థంబం, మూడులాంతర్లు మీదుగా హుకుం పేటకు చేరుకుంది. భక్తులు సిరిమాను చెట్టు కు పసుపు నీళ్ల తో దారి పొడవునా స్వాగతం పలికారు. దాదాపు 12 గంటల పాటు సిరిమాను చెట్టు ఊరేగింపు సాగి నగరంలో కి చేరింది.