రాజధాని అమరావతి భూముల్లో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని మొదటి నుంచి చెబుతున్న వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం విస్తృత అధికారాలతో ప్రత్యేక సెట్ ఏర్పాటు చేసింది. ఐపీఎస్ అధికారి కొల్లి రఘురామ్రెడ్డి ఆధ్వర్యంలో 10 మంది సభ్యులు ఈ సెట్ లో ఉంటారు. గతంలో మంత్రివర్గ ఉప సంఘం సమర్పించిన నివేదికలోని అంశాలపై సిట్ విచారణ చేపట్టనుంది.
సీఆర్డీఏ పరిధిలోని సరిహద్దుల మార్పు, అవకతవకలు, ఇన్సైడర్ ట్రేడింగ్, బినామీ లావాదేవీల ఆరోపణలపై ప్రత్యేక దర్యాప్తు బృందం దృష్టి సారించనుంది. మంత్రివర్గ ఉపసంఘం నివేదికను విచారించి, పరిశోధించి, క్రిమినల్ కేసులు పెట్టే అధికారం కూడా సిట్కు కట్టబెట్టింది. ఈ క్రమంలో అవసరమైతే కేంద్ర, రాష్ట్ర పరిధిలోని ఇతర విచారణ సంస్థల సహాయం తీసుకునేందుకు వెసులుబాటు కల్పించింది.
సీఆర్డీఏతో పాటు ఇతర ప్రాజెక్టుల్లోని అక్రమాల ఆరోపణలపైనా సిట్ విచారణ చేపట్టనుంది. ప్రత్యేక దర్యాప్తు బృందం సభ్యులుగా ఐపీఎస్ అధికారులు అట్టాడ బాబూజీ, వెంకట అప్పలనాయుడు, శ్రీనివాస్రెడ్డి, జయరామ్రాజు, విజయ్ భాస్కర్, గిరిధర్, కెనడీ, శ్రీనివాసన్, ఎస్వీ రాజశేఖర్రెడ్డిలు ఉంటారు.
ఈ మేరకు శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బృందం గత ప్రభుత్వ హాయాంలో చోటుచేసుకున్న రాజధాని భూములు, అవినీతి ఆరోపణలపై లోతైన విచారణ జరుపనుంది. రాజధాని వ్యవహారాల్లో జరిగిన న్యాయ, ఆర్థిక పరమైన అక్రమాలపైనా సిట్ విచారణ చేయనుంది.