ఒకరికి తెలియకుండా మరొకరిని పెళ్లి చేసుకునే మగాళ్లను చూసి ఉంటారు. మహిళలు కూడా అలా చేస్తారా? నేనైతే అలానే చేశాను అంటున్నది మౌనిక. ప్రకాశం జిల్లా మోదినీపురం గ్రామానికి చెందిన అనంతరెడ్డి కుమార్తె మౌనికకు కడప జిల్లా ఖాజీపేట మండలం కొమ్మలూరు గ్రామానికి చెందిన భూమిరెడ్డి రామకృష్ణారెడ్డితో 2018 మే నెలలో వివాహమైంది.
అమ్మాయి అందంగా ఉండటంతో రామకృష్ణారెడ్డి ఆమెను ఎదురుకట్నం ఇచ్చి పెళ్లి చేసుకున్నాడు. మూడు నెలల తర్వాత ఆగస్టు 25న తండ్రి అనంతరెడ్డి వచ్చి మౌనికను పుట్టింటికి తీసుకెళ్లాడు. ఆ తర్వాతి నుంచి వారి ఆచూకీ తెలియలేదు. ఆమె ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తుండటంతో అనుమానం వచ్చి రామకృష్ణారెడ్డి ఆగస్టు 29న పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సెల్ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా మౌనిక హైదరాబాద్లో ఉన్నట్లు గుర్తించారు. వివరాలు ఆరా తీయగా చంటినాయక్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని కాపురం చేస్తున్నట్లు తేలింది. దీంతో పోలీసులు మౌనికను అదుపులోకి విచారించగా, చంటినాయక్, రామకృష్ణారెడ్డి కంటే ముందే ఆమె మరో నలుగురిని పెళ్లి చేసుకున్నట్లు తేలింది.
దీంతో పోలీసులు నిందితురాలితో పాటు ఆమె తండ్రి, ఆరో భర్తను అరెస్ట్ చేసి జైలుకు పంపారు. ఏడాదిగా సాగుతున్న కేసు విచారణలో భాగంగా మౌనిక తండ్రిని దోషిగా నిర్ధారించిన మైదుకూరు కోర్టు అతడికి రెండేళ్ల జైలుశిక్షతో పాటు రూ.10వేల జరిమానా విధించింది. అయితే బెయిల్పై వచ్చిన మౌనిక, చంటినాయక్ వాయిదాలకు హాజరుకాకుండా తప్పించుకుని తిరుగుతున్నారు. వారిద్దరు దొరికితేనే కోర్టు వారికి శిక్షలు ఖరారు చేసే అవకాశం ఉంటుంది.