కరోనా ఎఫెక్ట్ తో తెలుగు చలన చిత్ర రంగం కుదేలైపోయింది. దాదాపు వెయ్యి కోట్ల రూపాయల పెట్టుబడిపెట్టి తీసిన సినిమాలు నిలిచిపోయాయి. వేసవి సెలవుల్లో విడుదల చేద్దామని సిద్ధం చేసుకున్న సినిమాలు శాశ్వతంగా ఆగిపోయే పరిస్థితి నెలకొని ఉంది. ఎందుకంటే ఇప్పటిలో సినిమా ధియేటర్లు ప్రారంభించే పరిస్థితి కనిపించడం లేదు.
ఫిబ్రవరి లో విడుదల అయిన చిత్రాలు తప్ప మిగిలినవన్నీ నిలిచిపోయాయి. మార్చి నెల నుంచి మే నెలాఖరులోపు విడుదల చేయడానికి దాదాపు 100కు పైగా చిత్రాలను సిద్ధం చేసుకున్నారు. అయితే మార్చి నెలాఖరు నుంచి లాక్ డౌన్ మొదలైంది.
వేసవి సెలవుల్లో విడుదల చేద్దామనుకున్నారు
మార్చిలో పరీక్షలు అయిన తర్వాత విడుదల చేద్దామనుకున్న సినిమాలు అన్నీ నిలిచిపోయాయి. 100 చిత్రాలు నిలిచిపోవడం అంటే మూమూలు విషయం కాదు. ఈ చిత్రాలలో చాలా వరకూ సెన్సార్ కూడా పూర్తి అయి ఉన్నాయి. ఐదు నుంచి 10 కోట్లు పెట్టి తీసిన చిత్రాలు కూడా వీటిలో ఉన్నాయి.
రూ.50 కోట్ల బడ్డెట్ తో తీసిన ఒక యువ హీరో చిత్రం కూడా విడుదల కాకుండా ఆగిపోయింది. మరో అగ్ర హీరోయిన్ కంబ్యాక్ సినిమా కూడా కరోనా ఎఫెక్ట్ తో నిలిచిపోయింది. ఈ చిత్రాలు విడుదల అయి వుంటే మరిన్ని చిత్రాల నిర్మాణం జరిగి ఉండేది.