పేద ప్రజలకు పంపిణీ చేయాల్సిన రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న ముఠా గుట్టును గుంటూరు రీజనల్ విజిలెన్స్ ఎన్ఫోర్స్ మెంట్ అధికారులు రట్టు చేశారు. బాపట్ల జిల్లా పరుచూరు మండలం నూతలపాడు గ్రామం నుండి కాకినాడకు ఈ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారని విశ్వసనీయ సమాచారం అందడంతో గుంటూరు రీజనల్ విజిలెన్సు ఎన్ఫోర్సుమెంట్ అధికారులు ఆకస్మికంగా దాడి చేశారు.
తెల్లవారుఝామున పరుచూరు మండలం నూతలపాడు గ్రామం లోని “శివాలయం-రామాలయం” రోడ్డువద్ద వేచివుండి, మినీ లారీ నుండి పెద్ద లారీ (అశోక్ లై ల్యాండ్ 14 టైర్ల వాహనం) లోనికి బస్తాలు లోడ్ చేస్తుండగా దాడిచేసి పట్టుకున్నారు. అశోక్ లై ల్యాండ్ లారీ డ్రైవర్ మాదా ప్రశాంత్, బస్తాలు లోడ్ చేస్తున్న చల్లపల్లి గోపీచంద్ లను విచారించగా వారు విన్నకోట కృష్ణారావు ఆదేశాల మేరకు నూతలపాడు గ్రామంలో గుదిబండి ఉపేంద్ర రెడ్డి నుండి అద్దెకు తీసుకున్న ఇంటిలో నుండి, నూతలపాడు గ్రామములో 44 నంబరు చౌక ధరల దుకాణం నుండి మినీ లారీ ద్వారా తీసుకువచ్చిన సబ్సిడీ బియ్యం బస్తాలను పెద్ద లారీలోకి లోడ్ చేస్తున్నట్లు చెప్పారు.
తనిఖీ చేయగా Eicher మినీ ట్రక్ లో 38 బస్తాలు, అశోక్ లై ల్యాండ్ పెద్ద లారీలో 472 బస్తాలు వెరశి 510 బస్తాల PDS బియ్యం అక్కడ ఉన్నాయి. బస్తాలన్నిటిపై A.P. స్టేట్ సివిల్ సప్లయిస్ కార్పోరేషను (APSCSC) ముద్రలు ఉన్నాయి. తదుపరి గ్రామంలోని 44 నంబరు చౌక ధరల దుకాణాన్ని తనిఖీ చెయ్యగా 90 బస్తాలు తరుగు వున్నట్లు గమనించారు. అదేవిధంగా 45 నంబరు చౌక ధరల దుకాణాన్ని తనిఖీ చెయ్యగా 16 బస్తాలు తరుగు వున్నట్లు గమనించారు.
చౌక ధరల దుకాణముల నుండి లారీల ద్వారా అక్రమంగా తరలిస్తున్న 510 బస్తాలలోని 257 క్వింటాళ్ళ PDS బియ్యాన్ని స్వాధీనం చేసుకుని, PDS బియ్యం అక్రమ వ్యాపారా చేస్తున్న వ్యక్తులు మరియు చౌక ధరల దుకాణాల డీలర్లపై 6-A మరియు క్రిమినల్ కేసులు నమోదు చెయ్యవలసినదిగా పరుచూరు CSDT ని విజిలెన్స్ అధికారులు కోరారు. ఈ తనిఖీలలో విజిలెన్స్ ఇన్స్పెక్టర్ ఎ. శ్రీహరిరావు, తహసిల్దార్ కె.నాగమల్లేశ్వర రావు, ఎస్.ఐ ఎం. రామచంద్రయ్య, సివిల్ సప్లయిస్ డిప్యూటీ తహసిల్దార్ ఆర్. వాసుదేవ రావు సిబ్బంది పాల్గొన్నారు.
ఎంఎస్ సుధాకర్, సత్యంన్యూస్.నెట్, పల్నాడు జిల్లా