సత్యం న్యూస్ నెట్ వర్క్
కొంత మంది సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులకు తమ పార్టీకి సంబంధం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న ఇప్పాల రవీంద్రారెడ్డి, వర్రా రవీంద్రారెడ్డి, యశ్వంత్ రెడ్డి, ఆనం నరేంద్రరెడ్డి, ఏ సతీష్ రెడ్డితో తమ పార్టీకి సంబంధం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం వెల్లడించింది.
సోషల్ మీడియాలో వారు పెడుతున్న పోస్టులకు గానీ, జగన్ కోసం అంటూ వారు నిర్వహిస్తున్న వాట్సప్ గ్రూపులకు ఫేస్ బుక్ పోస్టులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదని ఆ పార్టీ ప్రకటించింది. హైకోర్టు వెలువరిస్తున్న తీర్పులపైనా, సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల పైనా అనుచితమైన వ్యాఖ్యలు చేస్తూ బెదిరింపు పోస్టింగులు పెడుతున్న 93 మందికి హైకోర్టు నోటీసులు పంపిన విషయం తెలిసిందే.
న్యాయస్థానాలపైనా, న్యాయమూర్తుల పైనా సోషల్ మీడియా పోస్టింగులపై హైకోర్టు సీరియస్ గా ఉన్న విషయం కూడా విదితమే. ఈ పరిణామం అనంతరం ఆంధ్రప్రదేశ్ సీఐడి విభాగం కొందరిపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐదుగురితో తమకు సంబంధంలేని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించడం గమనార్హం.
హైకోర్టు ఫిర్యాదు మేరకు నోటీసులు వెళ్లిన వారిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యుడు, మాజీ ఎంఎల్ఏ, సాక్షి టీవీలో లైవ్ కార్యక్రమం నిర్వహించే ఒక జర్నలిస్టు కూడా ఉన్న విషయం తెలిసిందే.