మీడియా అంటే కేవలం వార్తలు రాయడమే కాదు, సామాజిక బాధ్యతను కూడా తలకెత్తుకోవాలని చాటిచెప్పారు ఈ ముగ్గురు జర్నలిస్టులు. మంట కలిసిపోతున్న మానవత్వానికి ఈ ముగ్గురు మరో పేరుగా నిలిచారు. తూర్పుగోదావరి జిల్లాలో మండల కేంద్రం రాయవరంలో కరోనా గురువారం ఓ కిరాణా వ్యాపారిని బలితీసుకుంది.
సదరు వ్యక్తి మృతదేహం తాకేందుకు ఎవ్వరూ ముందుకు రాలేదు. సుమారు ఉదయం ఎనిమిదిన్నర గంటలకు ఈ సంఘటన జరిగింది. ఇంట్లో ఆడవారు తప్ప మగవారు ఎవరూ లేరు. దహనసంస్కారాలు చేసేందుకు కుటుంబ సభ్యులు ఎవరూ కరోనా భయంతో ముందుకు రాలేదు.
ఈ విషయం తెలుసుకున్న రాయవరం మండలం ప్రెస్ క్లబ్ సభ్యులైన “విశ్వం వాయిస్” దినపత్రిక న్యూస్ ఎడిటర్ ఖండవెల్లి సునీల్ కుమార్, మండపేట నియోజకవర్గం”ఐ” న్యూస్ రిపోర్టర్ సత్తిబాబు, సామాజికవేత్త నజీర్ దహనసంస్కారాలు చేసేందుకు ముందుకొచ్చారు. దహనసంస్కారాలకు అన్నీ ఏర్పాట్లు చేసిన ఎంపీడీవో వారికి తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
ఈ ముగ్గురు పిపీఇ కిట్లను ధరించి అనుకున్నదే తడవు మృతదేహాన్ని బయటకి తీసుకొచ్చి, దహన సంస్కారాలు పూర్తిచేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీడియా మిత్రులిద్దరికీ రాయవరం ఎస్.ఐ శ్రీను నాయక్, గ్రామ వైసిపి నాయకులు తమలంపూడి గంగాధర్ రెడ్డి తో పాటుగా పలువురు అభినందనలు తెలియజేశారు. వీరి ముగ్గురితో పాటుగా ట్రాక్టర్ డ్రైవర్ ని యువకులు ఆదర్శంగా తీసుకోవాలని కొనియాడారు.