శశికాంత్ వాల్మీకి ఆర్థిక సహాయం తో సోమశిల పాఠశాలలో ఏర్పాటు చేసిన డిజిటల్ తరగతి ప్రారంభోత్సవం నేడు ఘనంగా జరిగింది. ప్రొజెక్టర్ తో పాటు క్రీడా సామగ్రి సైతం అందజేసిన ఆయన ఆ తరగతి ప్రారంభోత్సవ కార్యక్రమానికి వస్తూ మండుతున్న ఎండలను దృష్టిలో ఉంచుకుని విద్యార్ధులకు చల్లటి నీళ్ల సీసాలు అందచేశారు.
మొత్తం 140 మంది విద్యార్థులకు వాటిని అందించారు. ఈ కార్యక్రమంలో దాత శశికాంత్ వాల్మీకి దాతృత్వాన్ని ఉపాధ్యాయులు, గ్రామ ప్రజలు కొనియాడుతూ వారిని గ్రామస్థులు శాలువా, పూలమాలలతో అభిమానంలో ముంచెత్తారు. దీనితో పరవశించిపోయిన వాల్మీకి తన ఊపిరి ఉన్నంత వరకు పేద విద్యార్థుల శ్రేయస్సు కోసం పాటు పడతానని అన్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన కొల్లాపూర్ ప్రాంతానికి చెందిన ASP మురళి మాట్లాడుతూ తన స్వంత గడ్డగా భావించే సోమశిల కు అండగా ఉంటానని అన్నారు. ఆయన మాట్లాడుతూ గ్రామస్థుల, ఉపాధ్యాయుల కోరిక మేరకు మొదటి సహాయంగా పాఠశాల కు పెద్ద లోటుగా ఉన్న క్రీడా మైదానం కోసం వెంటనే రెండు లక్షల రూపాయలు విరాళమిస్తున్నట్లు తెలిపారు. తన శక్తి వంచన లేకుండా సోమశిల పాఠశాల అభివృద్ధికి పాటుపడతానని ఆయన అన్నారు. గ్రామస్థుల ఐక్యతా, ఉపాధ్యాయుల కృషి, విద్యార్థుల ప్రతిభ ను కొనియాడారు. ఈ కార్యక్రమంలో మేధా ఇస్టిట్యూట్ డైరెక్టర్ రుద్రపాటి జేసీ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్, SMC చైర్మన్, వైస్ చైర్మన్, మాజీ జడ్పీటీసీ, మాజీ సర్పంచ్ లు, మహిళ సంఘం అధ్యక్షురాలు గ్రామస్థులు పాల్గొన్నారు.