కన్న కొడుకులా చూసుకుంటాడని భావించి ఇల్లరికం తెచ్చుకున్న అల్లుడే మామ పాలిట కాలయముడయ్యాడు. అర్ధరాత్రి పడుకున్న సమయంలో మామ తలపై గొడ్డలితో బాది హత్యకు పాల్పడ్డాడు ఆ దుర్మార్గపు అల్లుడు. తెల్లారేసరికి ఈ ఘటన గ్రామంలో అలజడి సృష్టించింది.
వివరాల్లోకి వెళ్తే కామారెడ్డి జిల్లా కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని లింగపూర్ గ్రామంలో సొంత మామనే అల్లుడు హత్య చేసిన ఘటన కలకలం సృష్టించింది. గ్రామానికి చెందిన ఎనగుర్తి రాజలింగంకు ఒకే ఒక్క కూతురు భీమవ్వ ఉంది. కొడుకులు లేకపోవడంతో లింగంపేట్ మండలం ఐలపూర్ గ్రామానికి చెందిన లక్ష్మణ్ ను ఇల్లరికం తెచ్చుకున్నాడు రాజలింగం.
కూతురితో కలిసి రాజలింగం ఇంట్లోనే నివసిస్తున్నాడు. భీమవ్వకు బాబు అనే 30 సంవత్సరాల కొడుకు ఉన్నాడు. సోమవారం రాత్రి బైక్ విషయంలో మామా అల్లుళ్లకు చిన్నపాటి గొడవ జరిగింది. ఆ విషయంలో ఉదయం మాట్లాడుకుందామని రాత్రి అనుకున్నారు. రాత్రి పదకొండు గంటలకు ఇంటి ముందు జరుగుతున్న పెళ్లి రిసిప్షన్ వద్దకు భీమవ్వ వెళ్ళింది.
ఇదే అదునుగా భావించిన లక్ష్మణ్ ఇంట్లో ఉన్న గొడ్డలి తీసుకుని రాజలింగం తలపై బాదాడు. దాంతో రాజలింగం అక్కడిక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని విచారణ చేపట్టారు. క్లూస్ టీం రప్పించి వివరాలు సేకరిస్తున్నారు. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.