అధికార పార్టీకి చెందిన మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం సృష్టిస్తున్నాయి. గుంటూరులో జనతా వస్త్రాలు, చంద్రన్న కానుకలు పంపిణీ చేసిన ప్రవాస భారతీయుడు ఉయ్యూరు శ్రీనివాస్కు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అండగా నిలిచారు. గుంటూరులో జరిగిన ఈ తొక్కిసలాట సంఘటనలో ముగ్గురు మరణించిన విషయం తెలిసిందే. ఇది దురదృష్టకర ఘటన.. గతంలో చాలా మంది దుస్తులు పంపిణీ చేశారు…
అనుకోకుండా ఈ ఘటన జరిగింది…. ప్రజలకు కష్టం కలిగించాలని వారి ఉద్దేశ్యం కాదు అని వసంత కృష్ణ ప్రసాద్ వ్యాఖ్యానించారు. NRI లను భయపెడితే ఎలా వారు సేవా కార్యక్రమాలు ఎలా చేస్తారు అని ఆయన ప్రశ్నించారు. NRIలు వాళ్ల పని వాళ్లు చేసుకోవాలని కొందరు వ్యాఖ్యలు చేస్తున్నారు.. ఇది సరికాదు.. ఇలా చేస్తే వారు చేసే అభివృద్ధిని ఆపడమే అవుతుంది.. రాజకీయ వేదికపైకి వచ్చారనే ఉద్దేశంతోనే శ్రీనివాస్పై పనికిరాని రాద్ధాంతం చేస్తున్నారు..అంటూ కృష్ణ ప్రసాద్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఉయ్యూరు శ్రీనివాస్ తనకు మంచి మిత్రుడని, సేవా కార్యక్రమాలు చేయబోయి కష్టాలు పడుతున్నాడని ఆయన వ్యాఖ్యానించారు. గుంటూరులో జనతా వస్త్రాలు, చంద్రన్న కానుకలు పంపిణీ చేసేందుకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు వెళ్లిన విషయం తెలిసిందే.
చంద్రబాబునాయుడు వెళ్లిపోయిన తర్వాత తొక్కిసలాట జరిగి ముగ్గురు మరణించారు. ఈ సంఘటనపై అధికార వైసీపీ నానా రాద్ధాంతం చేసింది. మరణించిన వారికి తెలుగుదేశం పార్టీ నాయకులతో బాటు ఉయ్యూరు శ్రీనివాస్ పరిహారంగా ఆర్ధిక సాయం చేశారు. ఈ ఆర్ధిక సాయాన్ని ముఖ్యమంత్రి జగన్ ఎద్దేవా చేశారు. వారే చంపుతారు వారే పరిహారం ఇస్తారు అంటూ జగన్ వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంలో ఉయ్యూరు శ్రీనివాస్ అదే పార్టీకి చెందిన ఎమ్మెల్యే అండగా నిలబడటం ఆశ్చర్యం కలిగించింది. గతంలో ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తండ్రి మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చి సీఎం జగన్ తన తండ్రి రాజశేఖరరెడ్డి పేరు పెట్టుకున్నారు. ఈ సంఘటనను తీవ్రంగా వ్యతిరేకించిన వసంత నాగేశ్వరరావు
ప్రభుత్వం పై విమర్శలు కూడా చేశారు. తండ్రి చేసిన ఈ వ్యాఖ్యలపై వైసీపీ కీలక నాయకులు ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ను వివరణ అడిగారు. తన తండ్రి చేసిన వ్యాఖ్యలకు తాను క్షమాపణ చెబుతున్నానని ఆయన అప్పటిలో చెప్పారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడిని పిలిచి బట్టల పంపిణీ కార్యక్రమం చేపట్టిన ఉయ్యూరు శ్రీనివాస్ ను వసంత కృష్ణ ప్రసాద్ సపోర్టు చేయడం చర్చనీయాంశం అయింది.