త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న రాజస్థాన్, హర్యానా, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో ఇంటిని చక్కదిద్దుకోవడానికి ఏఐసీసీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ నడుంబిగించారు. సోనియా గాంధీ ప్రధానంగా రాజస్థాన్ పై దృష్టి సారించారు. అక్కడ యువనాయకుడు సచిన్ పైలట్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. అందువల్ల ప్రస్తుత ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ను ఏఐసీసీ సెక్రటేరియట్లో ఉన్నత పదవిని చేపట్టాలని కోరారని చెబుతున్నారు.
అయితే దీనికి ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ అంగీకరిస్తారో లేదో చూడాల్సి ఉంది. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా గాంధీ కుటుంబం నుంచి కాకుండా వేరే వారికి ఏఐసిసిలో ముఖ్య బాధ్యతలు అప్పగించాల్సిందిగా సూచించారు. అందువల్ల ఈ సూచన దృష్ట్యా కూడా అశోక్ గెహ్లాట్ ను రాజస్థాన్ పీఠం నుంచి కదిలించి ఏఐసిసిలో కీలక బాధ్యతలు అప్పగించాలని సోనియాగాంధీ భావిస్తున్నారు.
సోనియా గాంధీ సచిన్ పైలట్ ని పిలిచిన కొన్ని గంటలలోనే, రాజస్థాన్లో నాయకత్వ మార్పు గురించి అసాధారణ రీతిలో, గెహ్లాట్ స్వయంగా మాట్లాడటం ప్రారంభించారు. తెరవెనుక ఏదో జరిగినట్లుగా ముఖ్యమంత్రి, తన రాజీనామా లేఖ శాశ్వతంగా ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ వద్ద ఉందని వ్యాఖ్యానించారు. “నా రాజీనామా లేఖ సోనియా గాంధీ వద్దే ఉంటుంది. ముఖ్యమంత్రిని మార్చాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించినప్పుడు, ఎవరికీ చెప్పాల్సిన అవసరం కూడా లేదు.
దానిపై ఎలాంటి చర్చ అవసరం కూడా లేదు. కాంగ్రెస్ హైకమాండ్ స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటుంది అంటూ ఆయన వ్యాఖ్యానించారు. రాజస్థాన్లో కాంగ్రెస్ పార్టీ గెహ్లాట్ లేదా సచిన్ పైలట్ వీరిద్దరిలో ఎవరి నాయకత్వంలో ఎక్కువ పార్లమెంటరీ స్థానాలను సాధిస్తుందనే అంశంపై ప్రశాంత్ కిషోర్ ఇప్పటికే ఒక అంచనా వేశారు. దీనితో బాటు రాజస్థాన్ ఇంచార్జ్ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి అజయ్ మాకెన్ కూడా ఒక నివేదికను సమర్పించినట్లు సమాచారం.
నవంబర్-డిసెంబర్ 2023 లో జరగబోయే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ను విజయపథంలో నడిపించేందుకు ఎవరికి నాయకత్వం అప్పగించినా వారితో కలిసి పని చేస్తానని పైలట్ సోనియా గాంధీకి హామీ ఇచ్చారు. జూన్లో రాజస్థాన్లో నాలుగు రాజ్యసభ బెర్త్లు ఖాళీ కాబోతున్నాయి.
వీటిలో కాంగ్రెస్కు మూడు స్థానాలు దక్కే అవకాశం ఉంది. అందులో ఒకటి అశోక్ గెహ్లాట్ కు ఇచ్చి ఢిల్లీ పిలిపిస్తారేమో చూడాల్సి ఉంది. హర్యానా కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత అధ్యక్షురాలు కుమారి సెల్జా ఇప్పటికే రాజీనామా చేశారు. ప్రస్తుతం హర్యానా అసెంబ్లీలో కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నేతగా ఉన్న అనుభవజ్ఞుడైన భూపేంద్ర సింగ్ హుడా ను మళ్లీ పీసీసీ అధ్యక్షుడిగా ఎంచుకోవచ్చని భావిస్తున్నారు.
హుడా కు బాధ్యతలు అప్పగించాలని ప్రశాంత్ కిషోర్ కూడా ఇప్పటికే సిఫార్సు చేశాడు. మధ్యప్రదేశ్లో రాష్ట్ర పార్టీ యూనిట్ చీఫ్ కమల్ నాథ్ మధ్యప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడి పదవికి రాజీనామా చేయడానికి కూడా ప్రతిపాదించినట్లు సమాచారం.
అనుభవజ్ఞుడైన నాథ్, 2023 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి పార్టీని నడిపించేందుకు ఆసక్తిగా ఉన్నారు. తన జట్టులోని యువ నాయకులను తయారు చేసేందుకు సిద్ధమయ్యాడని కూడా చెబుతున్నారు. రెండు సంవత్సరాల క్రితం, కమల్ నాథ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, రాజ్యసభ ఎన్నికలకు ముందు జరిగిన పరిణామాలలో జ్యోతిరాదిత్య సింధియా తిరుగుబాటు చేసి బిజెపికి ఫిరాయించారు.