కడప జిల్లా నందలూరు లోని చారిత్రక ప్రసిద్ద శ్రీ సౌమ్యనాథస్వామి ఆలయం బ్రహ్మోత్సవాలు ఈనెల శుక్రవారం 16 వతేది అంకురార్పణతో మొదలై 25 ఆదివారం ధ్వజ అవరోహణం తో ముగియనున్నాయి.
బ్రహ్మోత్సవాలు 16 శుక్రవారం అంకురార్పణ తో ప్రారంభమౌతాయి. 17 శనివారం ఉదయం ధ్వజారోహణం రాత్రి యాలివాహణం,18 అదివారం ఉదయం పల్లకి సేవ రాత్రి హంస వాహనం,19 సోమవారం ఉదయం పల్లకి సేవ రాత్రి సింహా వాహనం,20 మంగళవారం ఉదయం పల్లకి సేవ రాత్రి హనుమంతు వాహనం, 21 బుధవారం ఉదయం శేష వాహనం రాత్రి గరుడ వాహనం,22 గురువారం ఉదయం సూర్యప్రభ రాత్రి చంద్రప్రభ,23 శుక్రవారం ఉదయం 8:50 గంటలకు శ్రీదేవి, భూదేవిలతో సౌమ్యనాధ స్వామి కళ్యాణం వేడుకగా జరుగ నున్నది.
అదేరోజు రాత్రి గజావాహనం పై స్వామి వారు ఊరేగ నున్నారు. 24 శనివారం ఉదయం ఎనిమిది గంటలకు రథోత్సవం రాత్రి అశ్వ వాహానం,25 ఆదివారం ఉదయం చక్రాస్నానం,రాత్రి ధ్వజా అవ రోహణము,పూర్ణాహుతితో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.
ఈ మేరకు మంగళవారం ఆలయంలో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జున రెడ్డి కుటుంబీకులు మేడా విజయ భాస్కర్ రెడ్డి,మేడా విజయ శేఖర్ రెడ్డి ఆలయ ఈవో కొండా రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో పాల్గొనే భక్తుల కోసం నిర్వాహకులు తగు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఆలయ చరిత్ర:
ఈ ఆలయంకు విశిష్ట చరిత్ర ఉంది. ఈ ఆలయం అతి పురాతనమైనది. పది ఎకరాల విశాల స్థలంలో చుట్టూ ప్రహరిగోడ,నాలుగు వైపులా గోపురాలతో దుర్భేద్యమైన కోటలా కనపడుతుంది. పద కొండవ శతాబ్దంలో కులుత్తుంగ చోళ రాజు ఇక్కడ ఆలయనిర్మాణాన్ని ఆరంభించారు.
తదనంతరం ఈ ప్రాంతాన్ని పాలించిన పాండ్య, కాకతీయ, విజయనగర రాజుల కాలంలో కూడా నిర్మాణ ప్రక్రియ కొనసాగింది అంటారు. పదిహేడవ శతాబ్దంలో స్థానిక పతి రాజుల కాలంలో పూర్తి అయినట్లుగా శాసనాల ఆధారంగా తెలుస్తోంది.
తూర్పు గోపురం గుండా ప్రాంగణం లోనికి ప్రవేశిస్తే ఈశాన్యంలో పుష్కరణి, రాతి స్థంభం,ధ్వజస్తంభం, గరుడా ఆళ్వార్ సన్నిధి, పక్కనే ఉన్న మండపంలో ఆంజనేయ స్వామి సన్నిది ఉన్నాయి.పూర్తిగా ఎర్ర రాతితో నిర్మించబడిన ఈ ఆలయాన్ని తిరువన్నమలై లో ఉన్న శ్రీ అరుణాచలేశ్వర స్వామి ఆలయానికి చిన్న రూపంగా పేర్కొంటారు.
మొత్తం నూట ఎనిమిది స్తంభాలపైన ప్రధాన ఆలయం నిర్మించారు.స్తంభాల పైన పురాణ ఘట్టాలను, నాటి ప్రజల జీవన శైలిని, చిత్ర విచిత్రమైన జంతువులను, ఆంజనేయ, గరుడ రూపాలను సుందరంగా జీవం ఉట్టి పడేలా మలచారు.
గర్భాలయ వెలుపలి గోడలలో శ్రీ గణేశ, శ్రీ ఆదిశేష విగ్రహాలను నిలిపారు. ముఖ మండపం నుండి కొద్దిగా ఎత్తులో వున్నగర్భాలయానికి సోపాన మార్గం ఉన్నది.ఇరు వైపులా జయ విజయులు ఉంటారు. పై మండప ద్వారం వద్ద ఉండగానే శ్రీ సౌమ్యనాధ స్వామి దివ్య రూపం నయన మనోహరంగా దర్శనమిస్తుంది. అర్ధ మండపం, గర్భలయాలలొ విద్యుత్ దీపాలుండవు. అయినా స్వామి వారు కళకళలాడుతూ కనపడతారు.
ఉదయం నుండి సాయంత్రం వరకు ఉండే సూర్య కాంతితో ప్రకాశిస్తారు మూల విరాట్టు. ఇది ఒక ప్రత్యేకతగా చెప్పుకోవాలి కలియుగ వైకుంఠము లో కొలువు తీరిన వేంకటేశ్వరుని ప్రతి రూపంగా ఉండే ఈ ఏడు అడుగుల సుందర స్వామిలో కనపడే తేడా అక్కడ వరద హస్తం కాగా ఇక్కడ అభయ హస్తం తో దర్శనమిస్తారు.
ఈ ఆలయంలో తమిళంలో ఎక్కువగా తెలుగులో కొద్దిగా శాసనాలు చెక్కబడి ఉంటాయి.వివిధ రాజ వంశాల రాజులు స్వామికి సమర్పించుకొన్న కైకర్యాల వివరాలు వీటిల్లో రాయబడినాయి.
కాకతీయ ప్రతాప రుద్రుడు గాలి పురం నిర్మించి వంద ఎకరాల మన్యం ఆలయ నిర్వహణకు ఇచ్చినట్లుగాను, సమీపంలోని పొత్తపి ని పాలించిన తిరు వేంగ నాధుని సతీ మణి శ్రీ సౌమ్యనాదునికి బంగారు కిరీటం, శంఖు చక్రాలు , మరెన్నో స్వర్ణాభరణాలు సమర్పించుకొన్నట్లుగా శాసనాల ఆధారంగా తెలుస్తోంది.
వాగ్గేయ కారుడు అన్నమయ్య కొంతకాలం నందలూరులో సౌమ్యనాధుని సేవలో గడిపారని, తన కీర్తనలతో స్వామిని ప్రస్తుతించారని శాసనాలలో పేర్కొనబడినది. గర్భాలయం ముందుపై కప్పుపై’’ చేప బొమ్మ ‘’ఉండటం ఇక్కడ ప్రత్యేకత.సృష్టి అంతమయ్యే ముందు వచ్చే జలప్రళయం లో నీరు ఈ ఆలయం లోని పైకప్పు పైఉన్న ఈ చేప బొమ్మను తాకగానే ఆ చేప సజీవమై ఆ నీటిలో కలిసి పోతుందని స్థానికులు చెబుతుంటారు.
తొమ్మిది ప్రదక్షిణలు :
ధృడమైన నమ్మకంతో, బలమైన కోరికతో ఓం శ్రీ సౌమ్యనాదయ నమః అంటూ గర్భాలయం చుట్టూ తొమ్మిది ప్రదక్షణలు చేసి మొక్కుకొంటే మనోభీష్టాలు నెరవేరుతాయి అన్న ఒక విశ్వాసం తరతరాల నుండి ఇక్కడ కొనసాగుతూ వస్తోంది.
కోరిక నెరవేరిన వారం రోజులలో వచ్చి నూట ఎనిమిది ప్రదక్షిణలు చెయ్యాలి అని కూడా అంటారు.