ఎస్ పి బాల సుబ్రహ్మణ్యం…. ఆయన గురించి కొత్తగా చెప్పాల్సిందేమీ లేదు. ఆయన ఇప్పుడు కరోనాతో చెన్నైలోని ఎంజిఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యం గురించి ఆందోళన చెందని వారు లేరు. ఆయన చికిత్సకు రెస్పాండ్ అవుతున్నారని ఆయన కుమారుడు ఎస్ పి చరణ్ వెల్లడించిన తర్వాత ఆయన అభిమానులు కుదుట పడ్డారు.
ఆయన ఐసీయూలో ఉన్నప్పటి ఫొటోను చూసుకుని ఫర్వాలేదు మా బాలూ కోలుకుంటున్నాడు అనుకున్నారు. ఆయనకు తమ ప్రభుత్వం పూర్తి స్థాయిలో అండదండా అందిస్తుందని తమిళనాడు ప్రభుత్వం వెల్లడించింది. ఎంజిఎం ఆసుపత్రిలో ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం చికిత్సకు అయ్యే ఖర్చు మొత్తాన్ని కూడా తామే భరిస్తామని తమిళనాడు ఆరోగ్య శాఖ మంత్రి విజయభాస్కర్ వెల్లడించారు.
ఎస్ బి బాల సుబ్రహ్మణ్యం కు చికిత్స చేయించడానికి డబ్బులు అవసరం లేకపోవచ్చు. ఆయన సంపాదించిన డబ్బు చికిత్సకు ఏ లోటూ లేకుండా జరిపించే అవకాశం కూడా ఉండి ఉండవచ్చు. ఆయన కుమారుడు ఎస్ పి చరణ్ ఆయనను కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉండి ఉండవచ్చు.
ఆయన ను ఎంజిఎం ఆసుపత్రి వైద్యులు చికిత్సకు డబ్బులు కూడా అడిగి ఉండకపోవచ్చు. ఎస్ పి బాల సుబ్రహ్మణ్యం జాతీయ ఆస్తి. ఆయన ను కాపాడుకోవాల్సిన అవసరం ఈ దేశంలోని సంగీత అభిమానులందరికి ఉన్నది. అందుకే ఆయన ఆరోగ్యం కోసం అందరూ ప్రార్థిస్తున్నారు.
అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం ఇప్పటి వరకూ ఎలాంటి స్పందనా తెలియ చేయలేదు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎస్ బి బాలసుబ్రహ్మణ్యం చికిత్సకు అయ్యే ఖర్చును భరిస్తామని ప్రకటించలేదు. పాపం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంధ్రా ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ బిజీగా ఉన్నట్లు ఉన్నారు.