ప్రజా సమస్యల పరిష్కారానికి విజయనగరం జిల్లా కలెక్టరేట్ లో ప్రతివారం నిర్వహించే స్పందన కు 322 వినతులు అందాయి. ఈ వినతులను జిల్లా కలెక్టర్ ఎ. సూర్యకుమారి, సంయుక్త కలెక్టర్లు డా. జి.సి.కిషోర్ కుమార్, డా. మహేష్ కుమార్, హౌసింగ్ జే.సి మయూర్ అశోక్, జే. వెంకట రావు, డి.ఆర్.ఓ గణపతి రావు, డి.పి.ఎం. పద్మావతి స్వీకరించి, సంబంధిత శాఖల అధికారులకు అందజేసారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ స్పందన వినతులను గడువు కంటే ముందుగానే పరిష్కారం జరగాలని అధికారులకు ఆదేశించారు. ఇక వచ్చిన 322 వినతులలో రెవిన్యూ కు సంబంధించి 225, డి.ఆర్.డి.ఎ కు 51 , జిల్లా వైద్య ఆరోగ్య శాఖకు 10 , డి.సి.హెచ్.ఎస్ కు 26 , దరఖాస్తులు అందగా పౌర సరఫరాలకు సంబంధించి 10 దరఖస్తులు అందాయి.
సచివాలయాల కు స్పోర్ట్స్ కోటా లో నియామకం అయిన ఐదుగురు డిజిటల్ అసిస్టెంట్లకు నియామక పత్రాలను స్పందన కార్యక్రమం లో జిల్లా కలెక్టర్ అందజేశారు. స్పోర్ట్స్ కోటా లో 10 పోస్టులు ఖాళీలు ఉండగా ఐదుగురుని నియమించారు. ప్రతి సోమవారం జరుగుతున్న స్పందన కార్యక్రమంలో వినతులను అందజేయటానికి కలక్టరేట్ కు వచ్చే అర్జీదారులకు స్పందన భోజనం అందించడానికి ఏపీ బాలయోగి గురు కులాల విద్యాలయాల సమన్వయ కర్త చంద్రావతి 10 వేల రూపాయలను జిల్లా కలెక్టర్ సూర్య కుమారికి అందజేశారు.
ఒక్కరోజే 20వేల మంది పెన్షనర్లకు కరోనా వేక్సిన్….
ఇక జిల్లాలో నిర్వహించిన స్పెషల్ డ్రైవ్లో భాగంగా, ఆ ఒక్కరోజులో 20వేల మందికి పైగా పెన్షనర్లకు కోవిడ్ వేక్సిన్ వేసి, జిల్లా యంత్రాంగం కొత్త రికార్డు సృష్టించింది. జిల్లా కలెక్టర్ సూర్యకుమారి ఇచ్చిన పిలుపు మేరకు, జిల్లా వ్యాప్తంగా ఉన్న సామాజిక పింఛన్ దారులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కోవిడ్ వేక్సిన్ వేయించుకున్నారు.
ఒక్క కర్లాం పిహెచ్సి పరిధిలోనే సుమారు 2వేల మంది పెన్షనర్లు వేక్సిన్ వేయించుకున్నారు.. కలెక్టర్ ఆదేశాల మేరకు వలంటీర్ తోపాటు ఎఎన్ఎం, ఆశా కార్యకర్తలు గ్రామాల్లోకి వెళ్లి, వేక్సిన్ వేయించుకోవాలని పింఛన్లను కోరారు. వేక్సిన్ వేసుకున్న అనంతరం వలంటీర్ వారికి పింఛన్ అందజేశారు. కొన్నిచోట్ల వైద్యాధికారులు, స్థానిక సర్పంచ్లు, ప్రజా ప్రతినిధులు కూడా వేక్సినేషన్ కార్యక్రమానికి సహకారాన్ని అందించారు. మండలాల్లో ఎంపిడిఓలు, ప్రత్యేకాధికారులు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.