నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గ పరిధిలోని కోటగిరి మండలం హంగర్గ గ్రామంలో రూ. 1.51 కోట్లతో నిర్మించిన 30 డబుల్ బెడ్ ఇళ్ళను ప్రారంభించిన రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, లబ్ధిదారులతో గృహ ప్రవేశం చేయించారు.
నిజామాబాద్ జిల్లా DCCB అధ్యక్షుడు పోచారం భాస్కర్ రెడ్డి, నిజామాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్నగారి విఠల్ రావు అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో స్పీకర్ పోచారం మాట్లాడుతూ పేదింటి ఆడబిడ్డ ఆత్మగౌరవం కాపాడటానికే డబుల్ బెడ్ రూం ఇళ్ళు కట్టిస్తున్నట్లు చెప్పారు.
దేశంలో 29 రాష్ట్రాలలో ముఖ్యమంత్రులు ఉన్నారు కానీ పేద ప్రజల కోసం 100 శాతం సబ్సిడీతో రూ. 5.04 లక్షలతో అన్ని వసతులతో ఇళ్ళను నిర్మించి ఇవ్వడం తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే జరుగుతున్నదని ఆయన అన్నారు. బాన్సువాడ నియోజకవర్గ పరిధిలోని 106 గ్రామాలలో అన్ని వసతులతో రూ. 500 కోట్లతో 5000 ఇళ్ళు నిర్మిస్తున్నామని ఆయన ప్రకటించారు.
నిజాంసాగర్ ప్రాజెక్టు ఎండిపోయింది. భవిష్యత్తులో కూడా మంజీరా నది ద్వారా నీళ్లు వస్తాయని నమ్మకం లేదు. అందుకే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి నీళ్ళను నిజాంసాగర్ ప్రాజెక్టుకు తీసుకు వచ్చి ఆయకట్టు లోని భూములకు ఏటా రెండు పంటలకు పుష్కలంగా నీరు అందిస్తున్నామని స్పీకర్ తెలిపారు.