జిల్లాలో ప్రధాన మంత్రి గ్రామీణ యోజన పథకం అమలుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ ముషర్రఫ్ ఫారూఖీ అధికారులను ఆదేశించారు.
బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రధాన మంత్రి గ్రామీణ యోజన పథకం అమలు పై సంబంధిత శాఖల అధికారులతో నిర్వహించిన జిల్లా స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రధాన మంత్రి గ్రామీణ యోజన పథకం క్రింద ఎంపికైన గ్రామాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు.
జిల్లాలో ఎస్సి లు అధికంగా ఉన్న గ్రామాలను గుర్తించి ఆయా గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేయాలనీ సూచించారు. ఒక్కొక్క గ్రామానికి కేంద్ర ప్రభుత్వం 20లక్షల చొప్పున నిధులు మంజూరు చేస్తుందని తెలిపారు.
నచ్చన ఎల్లాపూర్, కొత్త మద్దిపడగ, కిర్గుల్, పాత పోచంపాడ్, జవహర్ పూర్ గ్రామాలలో పనులు చేపట్టాలన్నారు. గ్రామాలలో అంగన్వాడీలు, మరుగుదొడ్లు, ఇంకుడు గుంతలు నిర్మించాలని, ఇందుకోసం గ్రామస్థాయి లో కమిటీలను ఏర్పాటు చేయాలనీ సూచించారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్, జిల్లా పరిషత్ సిఈఓ సుధీర్, డిఆర్డివో వెంకటేశ్వర్లు, ఈఈ పిఆర్ సుదర్శన్ రావు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.