విజయనగరం జిల్లా పోలీసు అధికారులతో నేర సమీక్షా సమావేశాన్ని జిల్లా ఎస్పీ ఎం. దీపిక.. జిల్లా పోలీసు కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎం. దీపిక మాట్లాడుతూ ప్రభుత్వం ఇటీవల గుట్కాను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసినందున, ప్రజల ఆరోగ్యానికి అపాయంగా ఉండే గుట్కాల అక్రమ రవాణాదారులు, విక్రయదారులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, కేసులు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు.
స్పందన ఫిర్యాదులపై తక్షణమే చర్యలు చేపట్టాలని, తీసుకున్న చర్యలను తనకు నివేదించాలన్నారు. పోలీసు స్టేషనుకు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా ప్రవర్తించాలని, వారు స్టేషనుకు వచ్చిన కారణాలను తెలుసుకొని, చర్యలు చేపట్టాలన్నారు. స్టేషనులో నమోదైన అదృశ్యం కేసులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ట్రేస్ చేసేందుకు చర్యలు చేపట్టాలని, మహిళా పోలీసులు (ఎం.ఎస్.పి)ల సహకారాన్ని తీసుకోవాలన్నారు. ఆస్తికి సంబంధించిన నేరాల్లో రికవరీ చేసిన వస్తువుల వివరాలను, బరువును ఖచ్చితంగా రాసి, కోర్టుకు అప్పగించాలన్నారు.
చోరీ అయిన మోటారు సైకిళ్ళు వివరాలను బోలో యాప్ లో తప్పనిసరిగా నమోదు చేయాలన్నారు. ఇలా నమోదు చేయడం వలన పోలీసులు వాహన తనిఖీలు చేపట్టిన సమయంలోను, చలానాలు విధించే సమయంలో చోరీకి గురైన వాహనాలను సులువుగా గుర్తించవచ్చునన్నారు. నాన్ బెయిలబుల్ వారంట్లు పెండింగులో ఉన్న కేసుల్లో ష్యూరిటీదార్లుకు నోటీసులు జారీ చేసి, కోర్టు హాజరుపర్చి, వారంటుదార్లు వివరాలను సేకరించి, ఎగ్జిక్యూట్ చేయుటకు చర్యలు చేపట్టాలన్నారు.
రోడ్ సేఫ్టీ మ్యాప్ ప్రతి ష్టేషన్ లో ఉండాలి
పోలీసు స్టేషనులో నమోదైన, విచారణలో ఉన్న కేసుల ప్రగతిని ఎప్పటికప్పుడు సిసిటిఎన్ఎస్ లో నమోదు చేయాలన్నారు. అనుమానస్పద వ్యక్తుల వేలి ముద్రతలను మొబైల్ సెక్యూరిటీ చెక్ డివైజ్ తో తనిఖీలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అదే విధంగా రోడ్డు ప్రమాద వివరాలను సులువుగా తెలుసుకొనే విధంగా పోలీసు స్టేషనులో రోడ్డు సేఫ్టీ మ్యాపును ఏర్పాటు చేసి, రోడ్డు ప్రమాద వివరాలను, సమయాలను చార్ట్ మీద నమోదు చేయాలన్నారు.
మహిళలపై జరుగుతున్న నేరాల్లో బాధితులు ప్రభుత్వం నుండి నష్ట పరిహారం పొందేందుకు, సకాలంలో ప్రతిపాదనలను పంపాలన్నారు. ఎటిఎం మార్పిడి చేసి, మోసాలకు పాల్పడి, అరెస్టు కాబడిని నిందితులపై హిస్టరీ షీటు తెరవాలని, వారిపై నిఘా పెట్టాలని అధికారులను జిల్లా ఎస్పీ ఆదేశించారు.
విజిబుల్ పోలీసింగు చేసే సమయాల్లో ఎం.వి. నిబంధనలు అతిక్రమించిన వాహనాలపై గతంలో పెండింగులో చలానాలు ఉన్నట్లయితే, ఆయా వాహనాలను సీజ్ చేసి, పెండింగు చలానాలను కట్టిన తరువాతనే వాహనాలను రిలీజ్ చేయాలని అధికారులను జిల్లా ఎస్పీ ఆదేశించారు.
దర్యాప్తులో ఉన్న కేసుల్లో పెండింగులో ఉన్న అరెస్టులను వెంటనే చేపట్టి, కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలన్నారు. పోలీసు అధికారులు తమ పరిధిలో తరుచూ గ్రామ సందర్శనలు చేయాలని, స్థానికంగా ఉండే ప్రజలకు మాదకద్రవ్యాల నియంత్రణకు, దిశా యాప్, రహదారి భద్రతా నియమాలు గురించి అవగాహన కల్పించాలన్నారు.
తీవ్ర నేరాల్లో తక్షణమే అభియో పత్రాలు దాఖలు చేయాలి
అనంతరం, సిఐలు, డిఎస్పీలు దర్యాప్తు చేస్తున్న తీవ్రమైన నేరాలను జిల్లా ఎస్పీ సమీక్షించి, కోర్టుల్లో అభియోగ పత్రాలు దాఖలు చేసే విధంగా అధికారులకు జిల్లా ఎస్పీ దీపిక దిశానిర్దేశం చేసారు.
ఈ సమీక్షా సమావేశంలో అదనపు ఎస్పీ పి. సత్యన్నారాయణరావు, ఎ ఈ బి అదనపు ఎస్పీ ఎన్. శ్రీదేవీరావు, బొబ్బిలి డిఎస్పీ బి.మోహనరావు, పార్వతీపురం డిఎస్పీ ఎ.సుభాష్, ట్రాఫిక్ డిఎస్పీ ఎల్.మోహనరావు, ఎస్సీ ఎస్టీ సెల్ డిఎస్పీ ఆర్.శ్రీనివాసరావు, దిశ మహిళా పిఎస్ డిఎస్పీ టి. త్రినాధ్, ఎఆర్ డిఎస్పీఎల్. శేషాద్రి, లీగల్ ఎడ్వయిజర్ వై. పరశురాం, సిఐలు బి.వెంకటరావు, జి. రాంబాబు, ఎన్.శ్రీనివాసరావు, డి.రమేష్, బాల సూర్యారావు, సిహెచ్. శ్రీనివాసరావు, విజయనాధ్, జి.సంజీవరావు, ఎల్.అప్పలనాయుడు, ఎం. నాగేశ్వరరావు, శోభన్ బాబు, టివి తిరుపతిరావు, విజయ ఆనంద్, నర్సింహమూర్తి, వివిధ పోలీసు స్టేషనుల్లో పని చేస్తున్న ఎస్ఐలు, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.