కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో గణతంత్ర దినోత్సవాల సందర్భంగా ఓ అద్భుతమైన ఘటన చోటుచేసుకుంది. మండల కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో జాతీయ జెండాను స్థానిక నాయకులు ఎగురవేసి జాతీయ గీతం ఆలపిస్తున్నారు.
ఆ సమయంలో అటుగా వస్తున్న ఓ మతిస్థిమితం లేని వ్యక్తి ఒకేసారి రోడ్డుపై నిల్చుని జాతీయ జెండాకు వందనం చేసి గీతాలాపన అయ్యే అంత వరకు నిల్చుండడం పలువురిని ఆకట్టుకుంది. దీంతో పలువురు ఆయన తీరును అభినందిస్తున్నారు.
గత కొన్ని రోజుల నుండి ఆయన మండల కేంద్రంలో మతిస్థిమితం లేని వ్యక్తిగా తిరుగుతున్నాడు. ఆయన రాత్రివేళల్లో మాత్రం బీసీ బాలుర హాస్టల్ పక్కన గల షాధిఖాన భవనంలో నిద్రిస్తున్నట్లు చూసినట్టు పలువురు తెలిపారు.
ఏదేమైనప్పటికీ మతిస్థిమితం లేకున్నా జాతీయత ఆయన లో కనిపించడం పలువురిని విశేషంగా ఆకట్టుకుంది.