అయోధ్యలో రామాలయం నిర్మాణానికి భూమి పూజ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, నర్సాపురం పార్లమెంటు సభ్యుడు కె.రఘురామకృష్ణంరాజు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఢిల్లీలోని టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఆయన నేటి ఉదయం ప్రత్యేక పూజలు చేసారు.
అయోధ్యలో రామాలయం నిర్మాణం కు ఎటువంటి ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా పనులు కొనసాగాలని శాస్త్రోత్తంగా ఆయన పూజలు నిర్వహించారు. ప్రత్యేక పూజలు చేసిన తరువాత ఆలయ పూజారులను ఆయన ఘనంగా సత్కరించారు. జై శ్రీరామ్… జైజై శ్రీరామ్ అని నినాదాలను చేశారు.
అయోధ్యలో రామాలయం నిర్మాణానికి జరిగే కరసేవతో సహా అన్ని కార్యక్రమాలలో తాను పాల్గొంటానని ఈ సందర్భంగా రఘురామకృష్ణంరాజు ప్రకటించారు. అయోధ్యలో రామాలయం నిర్మాణానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేస్తున్న భూమి పూజ భారత దేశ చరిత్రలో ఒక మైలురాయి, దేశచరిత్రలో చిరస్మరణీయమైన రోజు, కోట్లాది ప్రజలు చిరకాల వాంఛ, అయోధ్యలో రామాలయం నిర్మాణం అయోధ్యలో రామమందిరం నిర్మాణాన్ని యావత్తు దేశ ప్రజలు హర్షిస్తున్నారని ఆయన అన్నారు.
ఏపి దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేయకపోవడం దురదృష్టకరం
ఆలస్యంగా అయినా అభిలాష నెరవేరడం ప్రతి రామభక్తుడికి పరమానంద కరమని ఆయన అన్నారు. కులమతాలకు అతీతంగా యావత్ దేశం రామమందిరం నిర్మాణాన్ని స్వాగతిస్తున్నారు.
రామాలయం నిర్మాణానికి అయోధ్యలో జరిగే భూమి పూజ కార్యక్రమం సందర్భంగా ఈ రోజు రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించాలని దేవాదాయ ధర్మాదాయ శాఖను ఆదేశించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ని కోరుతూ లేఖ రాసినా పూజ కార్యక్రమాలు నిర్వహించాలని దేవాదాయ ధర్మాదాయ శాఖను ఆదేశించక పోవడం చాల బాధాకరమని రఘురామకృష్ణంరాజు అన్నారు.