కష్టపడి పనిచేసిన వారికే అందలం అంటున్న చంద్రబాబు
ఊ అంటే ఉనికి. ఊం ఊం అన్నారో ఇక ఎంతటి వాళ్లయినా సరే దారి ఇంటికే. అలకలు, బెదిరింపులు, పార్టీ మారుతామనే బ్లాక్మెయిల్ రాజకీయాల పప్పులుడవు ఇక. ఈ మ్యాటర్లో టీడీపీ హైకమాండ్ స్ట్రాంగ్గా ఉండాలని ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది.
గతంలో టికెట్ల కోసం..ఆపై పదవుల కోసం సీనియర్లు బెట్టు చేసి మరీ తమ పట్టును సాధించుకునేవాళ్లు. అప్పట్లో వారి విషయంలో చంద్రబాబు మెతకవైఖరితో వాళ్లను బుజ్జగిస్తూ టికెట్లు ఇచ్చేవారు.కానీ ఇప్పుడు అలా కాదు. అధికారంలో ఉన్నప్పుడు హై హై నాయకాల చక్రం తిప్పి.. పార్టీ కష్టకాలంలో ఉన్పప్పుడు సైడ్లైన్ అయిన వారి విషయంలో చంద్రబాబు ఈసారి కఠినంగా ఉండాలనుకుంటున్నారట. అందుకు కారణం గ్రౌండ్లెవల్లో కార్యకర్తల నుంచి వెల్లువెత్తిన ఆగ్రహావేశాలే.
టీడీపీ నేతలపై అక్రమ కేసులు, అరెస్టుల క్రమంలో వైసీపీ సర్కార్ నిరంకుశ వైఖరికి నిరసనగా టీడీపీ శ్రేణులు రాష్ర్ట వ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు చేపట్టారు. పార్టీ కోసం ప్రాణాలను సైతం ఫనంగా పెట్టేలా లక్షలాది కార్యకర్తలు రోడ్డెక్కారు.కానీ వారిని ముందుకు నడిపించాల్సిన సీనియర్లు, మంత్రగిరి చేసిన వాళ్లు మాత్రం సీన్లోకి రాలేదు. సీనియర్ల వైఖరిపై అప్పట్లోనే కార్యకర్తలు హైకమాండ్కు ఫిర్యాదు చేశారు. అప్పుడే బాబు చాలా స్ట్రాంగ్ డిసెషన్ తీసుకున్నారట.
ఎవరైనా సరే ఎంతటివాళ్లయినా సరే పార్టీ లైన్కు కట్టుబడి ఉండకపో్తే తోక కత్తిరించుడే . జరిగేది ఇదే. అందుకు నిదర్శనంగా చిలకలూరిపేటలో అధిష్టాన నిర్ణయం చిటుక్కుమంది. పెద్దన్నగా చక్రం తిప్పిన ప్రత్తిపాటి పుల్లారావును లూప్లైన్లో పెట్టి భాష్యం ప్రవీణ్కు చిలుకలూరిపేట పగ్గాలు ఇవ్వాలని టీడీపీ హైకమాండ్ నిర్ణయం తీసుకుందనేది టాక్.
ఇక సత్తెనపల్లిలో కూడా సేమ్ టు సేమ్ సీన్. ఒకప్పుడు కోడెల శివప్రసాద్ రావు ఏం చెప్తే చంద్రబాబు అందుకు ఓకే అనేవారు. వాళ్లిద్దరి స్నేహం అలా వుండేది. స్థానిక రాజకీయాల్లో కోడెలకు అంత పట్టు వుండేది. కానీ ఇప్పుడు సీన్ మారింది. కన్నాకు సత్తెనపల్లి ఇంచార్జ్ పదవి ఇవ్వడంతో సత్తెనపల్లి రాజకీయం గుంటూరు కారం కన్నా ఘాటుగా మారింది. తనను కాదని కన్నాకు ప్రాధాన్యత ఇవ్వడంపై శివరాం సన్నాఫ్ కోడెల శివవ్రసాద్ కన్నెర్ర చేశారు. ఓరకంగా తిరుగుబావుటా ఎగరేశారు.
స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తాననడమే కాకుండా వైసీపీలో చేరతాననే సంకేతాలు కూడా ఇచ్చారట. వాటెవర్.. అట్టాంటి బెదిరింపులను పట్టించుకునే ప్రసక్తే లేదని హైకమాండ్ తేల్చి చెప్పింది.
ఇక సీమలో భూమా అఖిలప్రియ వర్సెస్ ఏవీ సుబ్బారెడ్డి ఎపిసోడ్పై కూడా అధిష్టానం ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. పార్టీ కోసం పనిచేసేవాళ్లకు.. ప్రజలకు అందుబాటులో ఉండేవాళ్లకు.. క్రమశిక్షణకు కట్టుబడి ఉండేవాళ్లకే ప్రాధాన్యత తప్ప సీనియర్ల ముసుగులో తాటాకు చప్పుళ్లు చేసే వారిని పక్కన పెట్టేందుకే హైకమాండ్ మొగ్గు చూపింది. ప్రత్తిపాటి పుల్లారావు , కోడెల శివరాం విషయంలో పార్టీ నిర్ణయంతో అది స్పష్టమైంది. మరి పవర్లో ఉన్నప్పుడు అన్నీతామై అధికారం చలాయించి..పార్టీ కష్టకాలంలో ఉన్న ఈ నాలుగేళ్లలో కార్యకర్తలకు అందుబాటులో లేని వియ్యంకులవారి విషయంలో కూడా ఈ స్ట్రాంగ్ నిర్ణయం తప్పదా? గంటా, నారాయణ సహా అప్పట్లో వెలుగు వెలిగి కష్టకాలంలో ముఖంచాటేసిన సీనియర్స్కు కౌంట్డౌన్ మొదలైనట్టేనా?